విస్తారా ఎయిర్లైన్స్, ఎయిరిండియా విమానాలు ఎదురుపడి తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదాన్ని తప్పించడంలో ఓ మహిళా పైలట్ చాకచక్యంగా వ్యవహరించారు. ఢిల్లీ నుంచి పుణే వెళుతున్న విస్తారా ఎ-320 విమానం 29 వేల అడుగుల ఎత్తులో ఎగురుతోంది. అదే సమయంలో ముంబై నుంచి భోపాల్కు వెళుతున్న ఎయిరిండియాకు చెందిన ఎయిర్బస్ ఏ-319 27 వేల అడుగులు ఎత్తులో ఎగురుతోంది. ఇంతలో విస్తారా పైలెట్లు విమానాన్ని 27 వేల అడుగుల ఎత్తుకి దించడంతో ఈ రెండు విమానాలు ఎదురుపడ్డాయి. ఆ సమయంలో విస్తారా విమానం మహిళా కో-పైలట్ అధీనంలో ఉంది. ఎయిర్ఇండియా విమానాన్ని మహిళా కమాండర్, కెప్టెన్ అనుపమ కోహ్లీ నడుపుతున్నారు. విస్తారా మరింత దగ్గరగా రావడంతో డేంజర్ బెల్ మోగింది. దీంతో మరింత ఎత్తుకు వెళ్లాలని ఏటీసీ నుంచి ఎయిరిండియా విమానానికి హెచ్చరికలు వచ్చాయి. విమానాన్ని కుడివైపునకు తిప్పి ఎత్తునకు తీసుకెళ్లారు. దీంతో రెండు విమానాలు కేవలం 100 అడుగుల దూరంలో దూసుకెళ్లాయి. విస్తారా విమానం కూడా 600 అడుగుల కిందకు దిగి వెళ్లడంతో కొద్ది సెకన్ల వ్యవధిలో పెద్ద ప్రమాదం నుంచి రెండు విమానాలు బయటపడ్డారు. 261 మంది ప్రాణాలు కాపాడిన ఎయిర్ఇండియా కెప్టెన్ అనుపమను అందరూ అభినందిస్తున్నారు. ప్రమాద సమయంలో విస్తారా విమానంలో 152 మందివుండగా, ఎయిర్ఇండియా విమానంలో 109 మంది ప్రయాణికులున్నారు.