మధుమేహం రాకూడదని బలంగా కోరుకుంటున్నారా? అయితే… మీ ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని అంటున్నారు డేనిష్ కేన్సర్ సొసైటీ రీసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్త సెసిలీ కైరో! కాకపోతే ఈ ఆహారం పూర్తి గింజలతో చేసినదై ఉండాలి. కొన్నిభాగాలను తొలగించి సిద్ధం చేసిన గోధుమ పిండి కాకుండా గోధుమలు మొత్తాన్ని మరపట్టిన దాన్నే వాడాలన్నమాట. గోధుమలతోపాటు ఇతర ఆహారం విషయంలోనూ ఈ పద్ధతిని పాటిస్తే మధుమేహం మాత్రమే కాకుండా కేన్సర్ను కూడా నిరోధించవచ్చునని సెసిలీ ఇటీవల నిర్వహించిన అధ్యయనం స్పష్టం చేస్తోంది.
రోజుకు ఒకపూటైన ఇలాంటి ఆహారం తీసుకుంటే మధుమేహం వచ్చే అవకాశం 11 శాతం వరకూ తగ్గుతుందని అంచనా. డెన్మార్క్లోని 50 – 65 మధ్య వయస్కులు దాదాపు 55 వేల మంది వివరాలను పరిశీలించిన తరువాత తాము ఈ అంచనాకు వచ్చామని వీరిలో 7400 మంది మధుమేహులు ఉన్నారని సెసిలీ వివరించారు. దాదాపు 15 ఏళ్లపాటు జరిగిన ఈ అధ్యయనంలో పాల్గొన్న వారందరూ తాము ఏ రోజు ఏం తిన్నదీ రాసుకోవాల్సి ఉంటుంది. ఆ వివరాలతోపాటు వారి ఆరోగ్య సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా గింజధాన్యాలు పూర్తి స్థాయిలో ఆహారంగా తీసుకునే వారికి మధుమేహం, గుండెజబ్బులు, పేవు కేన్సర్లు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
అల్ట్రాసౌండ్ ఇక చౌక అవుతుంది…
గర్భస్థ శిశువులను పరిశీలించడం మొదలుకొని శరీరం లోపలి అవయవాలను పరిశీలించడం వరకూ ఉపయోగించే అల్ట్రాసౌండ్ పరికరం ఇకపై కారు చౌకగా లభ్యమవనుంది. ఎందుకంటారా? యూనివర్శిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా శాస్త్రవేత్తలు ఈ పరికరంలోని అత్యంత కీలకమైన భాగం ఖర్చును గణనీయంగా తగ్గించేశారు. అల్ట్రాసౌండ్ పరికరంలో ఓ కంప్యూటర్తోపాటు దానికి అనుసంధానమైన ఒక చిన్న గాడ్జెట్ ఉంటుంది. ఈ గాడ్జెట్ను ప్రోబ్/ట్రాన్స్బ్యూసర్ అని పిలుస్తారు. సిలికాన్ రబ్బర్తో తయారవుతుంది ఇది. శరీరం లోపలి భాగాల చిత్రాలను తీసేందుకు ఈ ప్రొబ్లో ఇప్పటివరకూ పీజో ఎలక్ట్రిక్ స్ఫటికాలను వాడుతున్నారు.