ఎన్నికల్లో బీజేపీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని బిజు జనతాదళ్ ఆరోపించింది. జైపూర్ పార్లమెంటరీ స్థానంలోని 12 పోలింగ్ కేంద్రాల్లో బీజేపీ గూండాలు చొరబడి ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని రాష్ట్ర సీఈఓకు ఫిర్యాదు చేసింది.
పశ్చిమ బెంగాల్లోని సేరంపూర్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ తృణమూల్ కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. ఓటర్లను బెదిరిస్తూ ఓటింగ్ శాతం పెరగకుండా టీఎంసీ గూండాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తూ ఎన్నికల ప్రచారం చేయకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు.
ఎన్నికలు సజావుగా జరగకుండా బీజేపీ అడ్డంకులు సృష్టిస్తోందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కేంద్ర బలగాలు బీజేపీ నాయకులతో చేరి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. బీజేపీ ఎంపీ బాబుల్ సుప్రియో పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లి ప్రిసైడింగ్ ఆఫీసర్లు, ఓటర్లపై బెదిరింపులకు దిగారని ఈసీకి ఇచ్చిన లెటర్లో పేర్కొంది. కాగా,పశ్చిమ బెంగాల్ బిర్భూమ్ జిల్లాలోని ననూర్లో పోలింగ్ కేంద్రాల వద్ద బీజేపీ కార్యకర్తలు టీఎంసీ కార్యకర్తలను అడ్డగించటంతో అక్కడ పశ్చిమ బెంగాల్ బిర్భూమ్ జిల్లాలోని ననూర్లో ఉద్రిక్తత తలెత్తింది. టీఎంసీ మహిళా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.
నాలుగో దశ ఎన్నికల్లో మధ్యాహ్నం 2 గంటల వరకు 38.63 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. తొమ్మిది రాష్ట్రాల్లోని 72 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. బిహార్లో 37.71 శాతం, జమ్ము&కశ్మీర్లో 6.66, శాతం, మధ్యప్రదేశ్లో 43.44 శాతం, మహారాష్ట్ర 29.93 శాతం, ఒడిశా 35.79 శాతం, రాజస్తాన్ 44.62 శాతం, ఉత్తర్ప్రదేశ్లో 34.42 శాతం, పశ్చిమ బెంగాల్లో 52.37 శాతం, జార్ఖండ్ 44.90 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల కమిషన్ అంచనా వేసింది.
క్రికెట్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ తన కుటుంబంతో కలిసి ముంబైలోని బాంద్రాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ సెంటర్ 203లో సచిన్, ఆయన సతీమణి అంజలీ, కుమారుడు అర్జున్, కూతురు సారా ఓటు వేశారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ముంబైలోని బాంద్రాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ సెంటర్ 283లో ఆయన ఓటు వేశారు. ముంబైలోని జుహు పోలింగ్ కేంద్రంలో బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, జయ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ బచ్చన్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
హీరో రణ్వీర్ సింగ్ తన తండ్రితో కలిసి బాంద్రాలో ఓటు వేశారు. హీరోయిన్ కరీనా కపూర్ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. బాలీవుడ్ స్టార్ హృతిక్ తన కుటుంబం సభ్యులతో కలసి ముంబైలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పశ్చిమ బెంగాల్ బిర్భూమ్ జిల్లాలోని ననూర్లో టీఎంసీ మహిళా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పోలింగ్ కేంద్రాల వద్ద బీజేపీ కార్యకర్తలు టీఎంసీ కార్యకర్తలను అడ్డగించటం ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో టీఎంసీ మహిళా కార్యకర్తలు కర్రలు చేతబూని ఆందోళనకు దిగారు. కేంద్ర బలగాలు అందుబాటులో లేకపోవటంతో పోలీసు సిబ్బందే పరిస్థితిని చక్కబెడుతున్నారు.
పశ్చిమ బెంగాల్ అసన్సోల్ నియోజకవర్గంలో టీఎంసీ కార్యకర్తలు ఓ మహిళా రిపోర్టర్పై దాడికి పాల్పడ్డారు. మైకును లాక్కొని ఆమెపై చేయి చేసుకున్నారు. బాలీవుడ్ తారలు అజయ్ దేవ్గణ్, కాజల్ దంపతులు, అనుపమ్ ఖేర్, ప్రియాదత్ గేయ రచయిత గుల్జర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఉదయం 9 గంటల వరకు బీహార్ 10.75 శాతం, మధ్యప్రదేశ్ 10.09 శాతం, మహారాష్ట్ర 4.09 శాతం, ఒడిశా 9 శాతం, రాజస్తాన్ 7.57 శాతం, యూపీ 8.05శాతం, పశ్చిమ బెంగాల్ 16.74 శాతం, జార్ఖండ్ 10.94 శాతం పోలింగ్ నమోదైంది. బాలీవుడ్ నటీమణులు భాగ్య శ్రీ, సోనాలీ బింద్రే ముంబైలోని విలే పార్లేలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ప్రముఖ బాలీవుడ్ నటుడు, మిస్టర్ పర్ఫెక్ట్ అమిర్ఖాన్ ఆయన సతీమణి కిరణ్రావ్ ముంబై బాంద్రాలోని అన్నెస్ హైస్కూల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీనియర్ నటి మాధురీ దీక్షిత్ జుహులో ఓటు హక్కును వినియోగించుకున్నారు. హెచ్డీఎఫ్సీ ఛైర్మన్ దీపక్ పరేఖ్ పెద్దర్ రోడ్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.