Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

‘వివాహేతర బంధం’ తీర్పుతో బరి తెగించిన ఓ భర్త
పోలీసులు తనను ఏమీ చేయలేరని వ్యాఖ్య
తట్టుకోలేక భార్య ఆత్మహత్య
సూసైడ్‌ నోట్‌లో ఆవేదన వెల్లడి

చెన్నై, కోచి అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు గత వారం వెలువరించిన రెండు కీలక తీర్పులు అనూహ్య పరిణామాలకు దారితీశాయి. ఒకటి: వివాహేతర బంధం నేరం కాదంటూ ఇచ్చిన తీర్పుతో- చెన్నైలో బరితెగించిన ఓ భర్త ‘ఏం చేసుకుంటావో ఛేసుకో ఫో..’ అన్న రీతిలో కట్టుకున్న భార్య పట్ల నిర్దయగా, కటువుగా ప్రవర్తించాడు.. దాంతో ఆమె మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. ఇక రెండో ఘటన కేరళలోని శబరిమలలో… అక్కడున్న అయ్యప్ప ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల మధ్య మహిళలూ ప్రవేశించవచ్చన్న తీర్పుతో జీవితం మీద విరక్తి చెంది ఓ వ్యక్తి ఆత్మహత్యా యత్నానికి పాల్పడడం. ముఖ్యంగా చెన్నైలోని నెసపాక్కం ప్రాంతంలో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా వైరల్‌ అయ్యింది.

పోలీసుల కథనం ప్రకారం.. ఓ కార్పొరేషన్‌ పార్కులో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న జాన్‌పాల్‌ ఫ్రాంక్లిన్‌ (26), పుష్పలత (24) రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఏడాది వయసున్న కుమార్తె ఉంది. కొంత కాలంగా పుష్పలత అనారోగ్యానికి గురయ్యింది. ఆమెకు క్షయ ఉందని గ్రహించిన ఫ్రాంక్లిన్‌ క్రమేణా ఆమెకు దూరమవుతూ వచ్చాడు. అంతేకాదు, ఆమె మందులకు డబ్బులివ్వడం కూడా మానేశాడు. తన బాధను ఫ్రాంక్లిన్‌ స్నేహితుడొకరికి పుష్పలత చెప్పినపుడు అసలు విషయం బయటపడింది.. ఫ్రాంక్లిన్‌ వేరే మహిళతో సంబంధం పెట్టుకున్నట్లు ఆ స్నేహితుడు చెప్పాడు.

పుష్పలత వెంటనే మొన్నటి శనివారం రోజు రాత్రి భర్తను నిలదీసింది. ఆ మహిళతో సంబంధం వదులుకోకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. ఆ మాటలకు ఫ్రాంక్లిన్‌ పకపకా నవ్వాడు. ‘సుప్రీంకోర్టే వివాహేతర సంబంధం పెట్టుకోవచ్చని చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా వాళ్లేమీ చేయలేరు. పోలీసులు నా జోలికి వస్తే వాళ్లమీదే కోర్టు ధిక్కారం కింద కేసు వేస్తా. నా ఇష్టం.. నేను ఇలాగే ఉంటా. ఇష్టమైతే నాతో ఉండు, లేకుంటే వెళ్లిపో’ అంటూ ఇష్టమొచ్చినట్టు తిట్టాడు. భర్త వైఖరితో పుష్పలత కుంగిపోయింది. పోలీసులూ, చట్టమూ తనకు సాయం రావన్న భర్త మాటలతో దిగ్ర్భాంతికి గురయింది. తమ ఆవేదననంతా సూసైడ్‌ నోట్‌లో రాసి పుష్పలత ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె మరణం తరువాత- తనను ప్రశ్నించిన పోలీసులను కూడా ఫ్రాంక్లిన్‌ ఎదిరించడం గమనార్హం.