టెలికాం రంగంలో రోజురోజుకు పెరుగుతున్న పోటీని తట్టుకుని నిలబడి తన ‘బ్రాండ్’ ఇమేజ్ను కాపాడుకునేందుకు బిఎస్ఎన్ఎల్ కొత్తగా వింగ్స్ పథకాన్ని తీసుకొచ్చింది. ఇద్దరు వ్యక్తుల మధ్య ఫోన్లలో సంభాషణలు జరగాలంటే అందులో సిమ్ ఉండాలి. వీడియో కాలింగ్ అవసరమైతే ఆ సిమ్ల్లో ఇంటర్నెట్ డేటా బ్యాలెన్స్ ఉండాలి. వింగ్స్ నుంచి ఫోన్ చేయాలంటే మొబైల్లో సిమ్ అవసరం లేదు.
దానికి డేటా మాత్రమే ఉండాలి. దీని ద్వారా దేశంలో మొబైల్, లాండ్ లైన్కు ఏ సమయంలోనైనా కాల్స్ చేసుకోవచ్చు. వింగ్స్ అనేది విఒఐపి (వాయుస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్) వంటిదే. దీనికి వింగ్స్ కాల్స్కు చాలా వ్యత్యాసం ఉంటుంది.
విఒఐపి కాల్స్కు ఎలాంటి యాప్లు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు.
బిఎస్ఎన్ఎల్ నుంచి వింగ్స్ సేవలను పొందాలంటే అండ్రాయిడ్ ఫోన్లలో సిప్ (ఎస్ఐపి – సెషన్ ఇనిషియేషన్ ప్రొటోకాల్) యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది మొబైల్ ఫోన్కు బ్యాక్ ఎండ్ సాఫ్ట్వేర్గా పనిచేస్తుంది. ఈ యాప్లు కొన్ని చెల్లింపుల పద్ధతిలోనూ, మరికొన్ని ఉచిత యాప్లు గూగుల్ ప్లే స్టోర్లో ఉన్నాయి. వింగ్స్ సేవలను పొందడానికి బిఎ్సఎన్ఎల్ కార్యాలయాలకు వెళ్లి గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన అవసరం ఉండదు. సిమ్ లేకపోయినా… దీనికి ఒక నంబర్ను మాత్రం బిఎస్ఎన్ఎల్ కేటాయిస్తుంది.
ఇవీ ఆఫర్లు
- మొత్తం మూడు రకాల ప్లాన్లను వింగ్స్ పథకంలో అమలు చేస్తోంది బిఎస్ఎన్ఎల్.
- సాధారణ వినియోగదారులు ఏడాదికి రూ.1099 చెల్లించాల్సి ఉంటుంది. దీనికి అదనంగా 18 శాతం జిఎస్టి ఉంటుంది. వెరసి రూ.1,297లను చెల్లించాలి.
- లాండ్ఫోన్ ఉన్న వినియోగదారులకు ఈ ప్లాన్ 14 నెలలు వర్తిసుంది. ఏడాది కంటే అదనంగా మరో రెండు నెలలపాటు అదనంగా ఈ ప్లాన్ను వినియోగించుకోవచ్చు.
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏడాదికి రూ.599 ప్లాన్ను ప్రవేశపెట్టారు. జీఎస్టీ కలుపుకుని రూ.707లను చెల్లించాలి.
- విద్యార్థులకు ఇదే ప్లాన్ను అమలు చేస్తున్నారు.
- ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు మాత్రం వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవడం కుదరదు. వారు బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలోని కౌంటర్లలో ధ్రువీకరణపత్రాలను అందజేసి, వింగ్స్ నంబర్లను పొందాల్సి ఉంటుంది.