Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

నా షోలాపూర్‌ చెప్పులు పెళ్లిలో పోయాయి అవి కొత్తవి, మెత్తవి, కాలికి హత్తుకుపోయేవి.. అని ‘ముద్ద మందారం’ సినిమాలో జంద్యాల పలికించారు. ఇప్పుడు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుది కూడా దాదాపు ఇదే పరిస్థితి. ఆయన చెప్పులరిగేలా దేశమంతా తిరుగుతూ ఉంటారు! మరి, ఎవరికో ఏమో కానీ, ఆయన చెప్పులపైనే మనసు పడింది! తెలిసో తెలియకో తెలియదు కానీ, ఆయన చెప్పులు తీసుకెళ్లారు. సాధారణంగా ఆలయాలు, పెళ్లి మండపాల వద్ద చెప్పులు గల్లంతవడం చూస్తుంటాం. కానీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పులు మాత్రం ఓ బీజేపీ ఎంపీ ఇంటికెళ్లినప్పుడు మాయమయ్యాయి.
ఈ ఘటన శుక్రవారం బెంగళూరులో జరిగింది. అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉప రాష్ట్రపతి వెంకయ్య బెంగళూరు వచ్చారు. శుక్రవారం ఉదయం బెంగళూరు సెంట్రల్‌ నియోజకవర్గ బీజేపీ ఎంపీ పీసీ మోహన్‌ ఇంటికి అల్పాహార విందుకు వెళ్లారు. వెంకయ్యను కలుసుకోవడానికి కేంద్ర మంత్రి సదానంద గౌడతోపాటు పెద్దఎత్తున బీజేపీ నాయకులు, కార్యకర్తలు అక్కడకు వచ్చారు. అరగంటపాటు అందరినీ ఆయన పలకరించి టిఫిన్‌ ముగించుకొని, బయటకు వచ్చారు. ఇంటి గుమ్మంలో విడిచిన పాదరక్షలు అక్కడ కనిపించలేదు. కొద్దిసేపు వెతుకులాట తరువాత, అవి పోయినట్టు వెంకయ్య సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. వెంకయ్యను చూడటానికి వచ్చినవారిలో ఎవరో ఒకరు పొరపాటున వేసుకొని వెళ్లి ఉంటారని భావించారు.
కొత్తవి కొనడానికి ప్రయత్నించగా, అప్పటికి ఎంపీ ఇంటి సమీపంలోని షోరూమ్‌లు తెరుచుకోలేదు. పాదరక్షలు లేకుండానే బయలుదేరడానికి వెంకయ్య సిద్ధమవగా, ఎంపీ సహా బీజేపీ నాయకులు వారించారు. షోరూమ్‌లు తెరిచేదాకా ఆగి.. సెక్యూరిటీ అధికారులు కొని తెచ్చిన కొత్త పాదరక్షలు వేసుకొని వెంకయ్య అక్కడి నుంచి బయలుదేరారు. కాగా, ఇటీవల బెంగళూరులోనే జరిగిన ఓ కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు చెందిన బంగారు పెన్ను కూడా మాయమైన విషయం తెలిసిందే. ఆ పెన్ను తనకు దొరికిందంటూ ఓ మహిళ దానిని ఆయనకు తిరిగి ఇచ్చారు కూడా.