Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

తిరుమల గిరుల్లో వెలసిన శ్రీ వేంకటేశ్వరస్వామికి భక్తజనకోటి కోట్లాది రూపాయలను కానుకలుగా చెల్లిస్తుంటారు. అలా గత యేడాది భక్తులు శ్రీవారి హుండీలో చెల్లించిన కానుకల ద్వారా రూ.995.8 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. ఈ మొత్తం కూడా కేవలం భక్తులు హుండీలో సమర్పించిన కానుకల ద్వారానే సమకూర్చినట్టు తెలిపారు.
ఇకపోతే.. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆయన మాట్లాడుతూ, భక్తుల కోసం తిరుపతిలో 2500 గదులను నిర్మించనున్నామని తెలిపారు. బ్రేక్ దర్శన టిక్కెట్ల ధరను పెంచాలన్న ఆలోచనపై ఇంకా ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదని, ప్రభుత్వానికి కూడా ఎలాంటి నివేదికనూ పంపలేదన్నారు. గత సంవత్సరం మొత్తం 2,73,13,897 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని, 10,66,72,730 లడ్డూలను పంపిణీ చేశామని తెలిపారు.
మరోవైపు, కొత్త సంవత్సరంలో ఏప్రిల్ నెలకు కోటాకు సంబంధించి మొత్తం 56,593 టికెట్లు ఉన్నాయి. ఉదయం 10 గంటల నుండి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఎలక్ట్రానిక్ లాటరీ విధానం కింద 10,658 సేవా టిక్కెట్లు విడుదలయ్యాయి. ఇందులో సుప్రభాతం 7,878, తోమాల మరియు అర్చన 240, అష్టదళపాద పద్మారాధన 240, నిజపాద దర్శనం 2300 టికెట్లు ఉన్నాయని వివరించారు. సేవా టిక్కెట్ల బుకింగ్‌ను 4 రోజుల సమయానికి తగ్గించినట్టు తెలిపారు.
ఆన్‌లైన్‌లో జనరల్‌ కేటగిరిలో మొత్తం 45,935 సేవాటికెట్లు కాగా, వీటిలో విశేషపూజ 1,875, కల్యాణం 11,250, ఊంజల్‌సేవ 3000, ఆర్జిత బ్రహ్మోత్సవం 5,805, వసంతోత్సవం 11,180, సహస్ర దీపాలంకారసేవ 12,825 ఉన్నాయని ఆయన తెలిపారు.