ఇంటర్నెట్ డెస్క్: వీసా నిబంధనలు, నేరాలకు పాల్పడటం, వలస నిబంధలను ఉల్లంఘించిన వారిపై అమెరికా వేటు వేసింది. సుమారు 300కి పైగా విదేశీయులను ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్ మెంట్(ఐసీఈ) అరెస్టు చేసింది. ఇందులో ఆరుగురు భారతీయులు కూడా ఉన్నారు. అమెరికాలో ఉన్న ఇండియానా, ఇల్లినోయిస్, కాన్సస్, కెంటకీ, మిస్సోరి,విస్కన్సిన్ రాష్ట్రాల్లో దాదాపు నెలరోజుల పటు జరిపిన వివిధ ఆపరేషన్లలో భాగంగా వీసా నిబంధనలను, వలస విధానాల నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలతో 364మంది విదేశీయులను అరెస్టు చేశారు.
దాదాపు 25 దేశాలకు చెందిన వీరిలో భారత్నుంచి ఆరుగురు ఉండగా, కొలంబియా, చెక్ రిపబ్లిక్, ఈక్వెడార్, జర్మనీ, గ్వాటేమలా, హోండురాస్, మెక్సికో, సౌదీ అరేబియా, ఉక్రెయిన్ తదితర దేశాలకు చెందిన వీరిలో కేవలం మెక్సికోకు చెందిన వారే 236మంది ఉన్నారు. అరెస్టు చేసిన వారిలో 187మంది మీద క్రిమినల్ కేసులు బనాయించారు. అరెస్టు చేసిన వారిలో 22మంది మహిళలు ఉండగా 346మంది పురుషులున్నారు.
మహిళలపై దాడి, చిన్నారులను హింసించడం, చిన్నపిలల్లపై నిర్లక్ష్యం, గృహహింస మత్తు పదార్థాల రవాణా తదితర కేసుల విషయంలో 187మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.