Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

దిల్లీ: సెప్టెంబరు మొదటివారంలో బ్యాంకులు 2 రోజులే పనిచేస్తాయని సోషల్‌మీడియాలో వార్తలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని, వచ్చే వారంలో బ్యాంకులకు అదనపు సెలవులేమీ లేవని బ్యాంకు అధికారులు స్పష్టం చేస్తున్నప్పటికీ ఈ వదంతులు ఆగట్లేదు. దీంతో తాజాగా ఈ వార్తలపై కేంద్ర ఆర్థికశాఖ స్పందించింది. సెప్టెంబరు మొదటివారంలో బ్యాంకులు సాధారణ సెలవులు మినహా మిగతా రోజుల్లో యథావిధిగా పనిచేస్తాయని స్పష్టతనిచ్చింది.

‘సెప్టెంబరు మొదటివారంలో బ్యాంకులకు 6 రోజుల పాటు సెలవులున్నాయి అంటూ సోషల్‌మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అయితే ఇందులో ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వచ్చేవారం బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి. సెప్టెంబరు 1 శనివారం సెలవు ఏమీ లేదు. 2న ఆదివారం సాధారణ సెలవు. ఇక సెప్టెంబరు 3న కృష్ణాష్టమి పండగ ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా సెలవు లేదు. ఈ సెలవును రాష్ట్రాలవారీగానే ఇస్తున్నారు. ఇక సెప్టెంబరు 4,5,6,7 తేదీల్లో బ్యాంకుల కార్యకలాపాలు కొనసాగుతాయి. మళ్లీ సెప్టెంబరు 8 రెండో శనివారం కావడంతో ఆ రోజు సెలవు ఉంటుంది’ అని ఆర్థికశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

కాగా.. సెలవు రోజుల్లోనూ అన్ని రాష్ట్రాల్లోని ఏటీఎంలు పనిచేస్తాయని, ఆన్‌లైన్ బ్యాంకింగ్‌ లావాదేవీలు కొనసాగుతాయని ఆర్థికశాఖ తెలిపింది. ఏటీఎంలలో డబ్బు సరిపడా ఉంచాలని ఇప్పటికే అన్ని బ్యాంకులకు సూచించినట్లు పేర్కొంది. వదంతులు వస్తున్నట్లుగా వచ్చేవారం ఎలాంటి అదనపు సెలవులు లేవని, ప్రజలు ఆందోళన చెందొద్దని స్పష్టం చేసింది.

సెప్టెంబరు 4, 5 తేదీల్లో ఆర్‌బీఐ ఉద్యోగులు సామూహిక సెలవు ప్రకటించారు. ఈ సెలవుకు, మిగతా బ్యాంకు ఉద్యోగులకు ఎలాంటి సంబంధం లేదు. కానీ.. ఆ రోజుల్లోనూ బ్యాంకులు పనిచేయవని సోషల్‌మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఇది అవాస్తవమని ఆర్థికశాఖ క్లారిటీ ఇచ్చింది.