వరుస సిరీస్లలో జట్టుకు చారిత్రక విజయాలు అందించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్లో భాగంగా కోహ్లి తుది రెండు వన్డేలకు దూరం కానున్నాడు. అదేవిధంగా టీ20 సిరీస్కు కోహ్లి అందుబాటులో ఉండడని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తెలిపింది. కోహ్లి స్థానంలో వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకు సారథ్య బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొంది.
విశ్రాంతి అవసరం..
‘గత కొన్ని నెలలుగా కోహ్లిపై పని ఒత్తిడి పెరిగింది. ప్రస్తుతం అతడికి విశ్రాంతి అవసరం. అదే విధంగా భారత్లో ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్కు కోహ్లి సన్నద్ధం కావాలి. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని సీనియర్ సెలక్షన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది’ అని బీసీసీఐ మీడియాకు వెల్లడించింది. ఈ నేపథ్యంలో హామిల్టన్, వెల్లింగ్టన్ వన్డేలతో పాటు.. ఫిబ్రవరి 6న మొదలయ్యే టీ20 సిరీస్కు కూడా రోహిత్ శర్మ సారథ్యం వహించనున్నాడు. ఇక నేపియర్లో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే.