Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

అసలే వేసవి. దాహార్తితో అల్లాడే జనం శీతల పానీయాల కోసం అర్రులు చాస్తారు. నిమ్మరసం మొదలుకొని నానా రకాల పండ్ల రసాలు, మజ్జిగ, లస్సీ, మిల్క్‌ షేక్‌ వంటి పానీయాలను గ్లాసుల కొద్దీ తాగేస్తారు. మిగిలిన పానీయాలు ఫర్వాలేదు గాని, మిల్క్‌ షేక్స్‌ విషయంలో కొంత జాగ్రత్త తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పుష్కలంగా మీగడ వేసి తయారుచేసే మిల్క్‌ షేక్స్‌ స్వల్ప వ్యవధిలోనే రక్తనాళాలపై, ఎర్ర రక్త కణాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయని తమ పరిశోధనలో తేలిందని, రుచి కోసం ఎడాపెడా మిల్క్‌ షేక్స్‌ తాగేస్తూ పోతే దీర్ఘకాలంలో గుండెకు చేటు తప్పదని జార్జియాలోని అగస్టా యూనివర్సిటీ మెడికల్‌ కాలేజీకి చెందిన నిపుణులు చెబుతున్నారు.

పరీక్షాత్మకంగా పదిమంది ఆరోగ్యవంతులకు ఒక్కో మిల్క్‌ షేక్‌ ఇచ్చారు. మిల్క్‌ షేక్‌ తాగిన నాలుగు గంటల తర్వాత వారిపై పరీక్షలు జరిపితే, వారి రక్తనాళాలు కుంచించుకుపోవడంతో పాటు, ఎర్ర రక్తకణాలు మృదుత్వాన్ని కోల్పోయినట్లు గుర్తించామని అగస్టా వర్సిటీ మెడికల్‌ కాలేజీలోని సెల్‌ బయాలజీ అండ్‌ అనాటమీ ప్రొఫెసర్‌ జూలియా బ్రిటన్‌ వెల్లడించారు.