చైనాను నిరవధికంగా పాలించాలన్న అధ్యక్షుడు జింగ్ పింగ్ ఆలోచనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆయన పాలనలో చైనా మరో ఉత్తర కొరియాలా మారుతుందన్న ఆందోళనను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. అందుకు గల కారణాలను వివవరిస్తున్న విశ్లేషకులు మున్ముందు ఆ నిర్ణయం చైనాకు ప్రమాదంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు.
2013లో మార్చి 14న 64 ఏళ్ల జింగ్ పింగ్ తొలి దఫా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు. ఈ మార్చితో ఆయన పదవీకాలం ముగియబోతోంది. చైనా రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి రెండుసార్లు మాత్రమే అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించేందుకు అర్హుడు. కానీ, జీ జిన్పింగ్ మాత్రం ఆ నిబంధనను సవరించేదిశగా ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. దేశ అధ్యక్ష, ఉపాధ్యక్షులు నిరవధికంగా కొనసాగేలా పార్టీ కేంద్ర కమిటీ ఓ కీలక ప్రతిపాదన చేసింది. త్వరలో దానికి పార్లమెంట్ అధికారిక ముద్ర కూడా వేయబోతోంది.
గతేడాది అక్టోబర్లోనే గుట్టు చప్పుడు కాకుండా ఈ ప్రతిపాదనను పార్లమెంట్ ఆమోదించింది. లీకుల ద్వారా ఆ విషయం బయటికి పొక్కటంతో విమర్శలు మొదలయ్యాయి. ఇప్పుడు ఆయన పదవీ కాలం దగ్గరపడుతుండటం, ఆ ప్రతిపాదనకు చట్టబద్ధత కల్పించేందుకు పావులు కదుపుతుండటంతో విమర్శకులు, విశ్లేషకులు రంగంలోకి దిగిపోయారు.