వాషింగ్టన్: అంతర్జాతీయంగా పెరుగుతున్న ఇంధన ధరలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఘాటుగా స్పందించారు. వెంటనే ధరలను తగ్గించాలంటూ ఒపెక్ దేశాలకు తాజా హెచ్చరిక జారీ చేశారు. ఆయిల్ ఎగుమతిదారుల కార్టెల్ క్రూడ్ ధరలను తగ్గించాలంటూ గురువారం ట్విటర్లో ఒక ప్రకటన జారీ చేశారు. మధ్యప్రాచ్య దేశాలకు తామే సైనిక రక్షణ అందిస్తున్నామనీ, ఇది కొనసాగాలంటే ధరల పెరుగుదల ఎంతమాత్రం మంచికాదన్నారు. ముడి చమురు ధరల పెరుగుదలకు ఒపెక్ దేశాల గుత్తాధిపత్యమే కారణమంటూ ట్రంప్ మరోసారి కన్నెర్రజేశారు. ఈ తరుణంలో ధరలు తగ్గించడం అవసరమని పేర్కొన్నారు.
మధ్యప్రాచ్య దేశాలను మేం కాపాడుతున్నాం. తాములేకుండా ఎంతోకాలం సురక్షితంగా ఉండలేరు. ధరలు ఇంకా ఇంకా పెంచుకుంటూ పోతున్నారు. దీన్ని మేం గుర్తు పెట్టుకుంటామంటూ ట్వీట్ చేశారు. ట్రంప్ ట్వీట్ తరువాత యుఎస్ బెంచ్ మార్కు ఫ్యూచర్స్ ధరలు కొద్దిగా పడిపోయాయి. దీంతో 70 డాలర్లను అధిగమించిన బ్యారెల్ ధర గురువారం 0.2 శాతం నష్టపోయింది.
కాగా ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకోకుండా ఇతర దేశాలపై ఒత్తిడి తీసుకురావడంతోపాటు అలాగే ఉత్పత్తిని పెంచాల్సిందిగా మిత్రదేశం సౌదీసౌదీ అరేబియాను అమెరికా కోరింది. ఒపెక్ వ్యవస్థాపక సభ్యులైన ఇరాన్, వెనిజులా కూడా ఆంక్షలు విధించింది. దీంతో అంతర్జాతీయ ఇంధన సంస్థ ప్రకారం, జులై 2016 ఇరాన్ ఉత్పత్తి చాలా తక్కువ స్థాయిని నమోదు చేసింది. నవంబరు 4న ఇస్లామిక్ రిపబ్లిక్ చమురు పరిశ్రమను దెబ్బతీసేందుకు కూడా కొత్త ఆంక్షలు విధించింది అమెరికా. ఒపెక్ దేశాల ఈ ఆధిపత్యాన్ని తగ్గించాలనే ఆలోచనలతో ఆమెరికా షేల్గ్యాస్ ఉత్పత్తిని పెంచి, ఆయిల్ దిగుమతులను తగ్గించుకుంది. దీంతో ఆయిల్ ధరలు తగ్గడంతో అమెరికా కుయుక్తులను దెబ్బతీసేందుకు ఒపెక్ దేశాలు కూడా ఆయిల్ ఉత్పత్తులను తగ్గించాయి. ప్రధానంగా 2014లో చమురు ధరలు కుప్పకూలిన నేపథ్యంలో 2016లో ప్రధాన చమురు ఉత్పత్తి సంస్థలన్నీ ( ఒపెక్, నాన్-ఒపెక్ దేశాలు) ఉత్పత్తిని తగ్గించేందుకు అంగీకరించాయి. మరోవైపు సౌది అరేబియా ఇరాన్లు, రష్యాలాంటి నాన్ ఒపెక్దేశాలతో భేటీ కానున్నాయి. ఉత్పత్తి స్థాయిలపై చర్చించనున్నాయి. నవంబరులోజరగనున్న అమెరికా మిడ్ టెర్మ్ ఎన్నికలకు మందు ఆదే చివరి సమావేశం.