పీవీ నరసింహారావు ముఖ్యమంత్రిగా తీసుకువచ్చిన భూ పరిమితి చట్టంతో ఆయనకు మిగిలింది ఆరు ఎకరాలు మాత్రమే. స్వాధీనం చేసుకున్న భూమిని ప్రభుత్వం కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ పార్కుగా ప్రకటించింది. ఉస్మాన్ అలీ ఖాన్ మరణించిన తర్వాత నిజాం వారసులుగా అనేక మంది ఆస్తిలో హక్కు కోసం కోర్టులను ఆశ్రయించడం, పన్నుల భారం, రాజభరణాల రద్దుతో ఆయన ఆస్ట్రేలియాకు వెళ్లిపోయారు. అక్కడి ఒక మారుమూల ప్రాంతంలోసముద్ర తీరంలో ఉండేవారు. 1975లో ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించడం, అప్పటికే ఇందిరాగాంధీ తనయుడు సంజయ్ గాంధీతో సంబంధాలు క్షీణించడం, రాజమాత గాయత్రీ దేవి అరెస్ట్ వంటి పరిణామాల నేపథ్యంలో ఆయన చాలాకాలం భారత్కు రాలేదు. అంతకుముందు కూడా ఆయన ఎక్కువ కాలం బ్రిటన్, టర్కీలలో గడిపారు.
ఆస్ట్రేలియాలో రెండో భార్యకు విడాకులు ఇచ్చినప్పుడు.. ఆమెకు భరణం కింద మొత్తం భూమిని అమ్మి ఆ సొమ్ము ఇచ్చి టర్కీకి మకాం మార్చారు. అక్కడ మధ్యధరాసముద్ర తీరంలోని ఒక చిన్న రెండు గదుల ఇంటిలో నివాసముంటున్నారు. ఆయన ఐదు వివాహాలు చేసుకున్నారు. ఐదుగురూ విదేశీ మహిళలే! ఆయన మొదటి భార్య టర్కీకి చెందిన ఎస్రా. తన వెంట అస్ర్టేలియాకు రావడానికి నిరాకరించడంతో ఆమెకు విడాకులిచ్చారు. 20 ఏళ్ల తర్వాత తిరిగి ఆమె మద్దతు కోరగా.. ఇప్పుడు నిజాం ఆస్తుల ఆలనాపాలనా ఆమె చూస్తున్నారు. ఈ క్రమంలో ఆమె ముఖ్యమంత్రి కేసీఆర్తో కూడా సమావేశమయ్యారు. ఎవరితో కలవడానికి, మాట్లాడ్డానికి ఇష్టపడకుండా ఏకాంత జీవితం గడుపుతున్న ముక్రం జాను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గోనవల్సిందిగా ప్రభుత్వం కోరినా ఆయన రాలేదు. సౌదీ అరేబియా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలలో వివాదాల్లో ఉన్న తన ఆస్తుల గురించి ఆయన పట్టించుకోవట్లేదు. కాగా.. ఇప్పటికీ హైదరాబాద్కు వస్తే మాత్రం చిరాన్ ప్యాలెసే ఆయన నివాసం.