Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఏడుతరాలపాటు హైదరాబాద్‌ను ఏకఛత్రాధిపత్యంగా ఏలిన నిజాం నవాబుల వారసుడు ఆయన! ఫ్రాన్స్‌లో పుట్టి లండన్‌లో విద్యాభ్యాసం చేసి.. స్వదేశానికి వచ్చి భాగ్యనగరం నడిబొడ్డున 400 ఎకరాల పచ్చటి ప్రకృతి నడుమ నిర్మించిన చిరాన్‌ ప్యాలెస్‌లో విలాసవంతమైన జీవితం గడిపారు! కానీ.. డబ్బు, ఆస్తి వివాదాలతో విసుగెత్తి 1970ల్లో మళ్లీ విదేశాలకు వెళ్లిపోయారు. అద్భుతమైన రాజప్రాసాదం నుంచి.. ఆస్ట్రేలియాలో 2లక్షల హెక్టార్ల ఫాంహౌజ్‌కు.. అక్కడి నుంచి టర్కీకి చేరుకుని అక్కడ రెండు గదుల ఇంట్లో ఉంటున్నారు! నిజాం నవాబు వారసుడు.. మిర్‌ బర్కత్‌ అలీ ఖాన్‌ అలియాస్‌ ప్రిన్స్‌ ముక్రం జా జీవిత ప్రస్థానమిది. అప్పుడప్పుడూ చుట్టంచూపుగా వచ్చిపోవడమే తప్ప తన జీవితకాలంలో ఆయన ఎక్కువ భాగం ప్రవాసంలోనే ఉన్నారు. ఏడవ నిజాం మిర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ తన పెద్ద కొడుకు ఆజం జాను (వరంగల్‌లోని ఆజం జాహీ మిల్స్‌ ఆయన పేర ప్రారంభించిందే) కాదని అతని కొడుకైన, తన మనవడు ముక్రం జాను వారసుడిగా ప్రకటించారు. దాన్ని కేంద్ర ప్రభుత్వం కూడ ధ్రువీకరించింది. ప్రధాని ఇందిరా గాంధీ 1971లో రాజభరణాల రద్దు చేసే వరకూ 8వ నిజాంగా గౌరవించింది. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో 400 ఎకరాల వైశాల్యంలోని అడవిలో చిరాన్‌ ప్యాలెస్‌లో ఆయన నివాసం ఉండేవారు.

పీవీ నరసింహారావు ముఖ్యమంత్రిగా తీసుకువచ్చిన భూ పరిమితి చట్టంతో ఆయనకు మిగిలింది ఆరు ఎకరాలు మాత్రమే. స్వాధీనం చేసుకున్న భూమిని ప్రభుత్వం కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ పార్కుగా ప్రకటించింది. ఉస్మాన్‌ అలీ ఖాన్‌ మరణించిన తర్వాత నిజాం వారసులుగా అనేక మంది ఆస్తిలో హక్కు కోసం కోర్టులను ఆశ్రయించడం, పన్నుల భారం, రాజభరణాల రద్దుతో ఆయన ఆస్ట్రేలియాకు వెళ్లిపోయారు. అక్కడి ఒక మారుమూల ప్రాంతంలోసముద్ర తీరంలో ఉండేవారు. 1975లో ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించడం, అప్పటికే ఇందిరాగాంధీ తనయుడు సంజయ్‌ గాంధీతో సంబంధాలు క్షీణించడం, రాజమాత గాయత్రీ దేవి అరెస్ట్‌ వంటి పరిణామాల నేపథ్యంలో ఆయన చాలాకాలం భారత్‌కు రాలేదు. అంతకుముందు కూడా ఆయన ఎక్కువ కాలం బ్రిటన్‌, టర్కీలలో గడిపారు.

ఆస్ట్రేలియాలో రెండో భార్యకు విడాకులు ఇచ్చినప్పుడు.. ఆమెకు భరణం కింద మొత్తం భూమిని అమ్మి ఆ సొమ్ము ఇచ్చి టర్కీకి మకాం మార్చారు. అక్కడ మధ్యధరాసముద్ర తీరంలోని ఒక చిన్న రెండు గదుల ఇంటిలో నివాసముంటున్నారు. ఆయన ఐదు వివాహాలు చేసుకున్నారు. ఐదుగురూ విదేశీ మహిళలే! ఆయన మొదటి భార్య టర్కీకి చెందిన ఎస్రా. తన వెంట అస్ర్టేలియాకు రావడానికి నిరాకరించడంతో ఆమెకు విడాకులిచ్చారు. 20 ఏళ్ల తర్వాత తిరిగి ఆమె మద్దతు కోరగా.. ఇప్పుడు నిజాం ఆస్తుల ఆలనాపాలనా ఆమె చూస్తున్నారు. ఈ క్రమంలో ఆమె ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కూడా సమావేశమయ్యారు. ఎవరితో కలవడానికి, మాట్లాడ్డానికి ఇష్టపడకుండా ఏకాంత జీవితం గడుపుతున్న ముక్రం జాను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గోనవల్సిందిగా ప్రభుత్వం కోరినా ఆయన రాలేదు. సౌదీ అరేబియా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ దేశాలలో వివాదాల్లో ఉన్న తన ఆస్తుల గురించి ఆయన పట్టించుకోవట్లేదు. కాగా.. ఇప్పటికీ హైదరాబాద్‌కు వస్తే మాత్రం చిరాన్‌ ప్యాలెసే ఆయన నివాసం.