మనకూ, భగవంతుడికీ మధ్య అడ్డుగా నిలిచేది మనస్సు. జీవుడి స్థాయిలో దాన్ని ‘మనస్సు’ అంటే, దేవుడి స్థాయిలో దాన్ని ‘మాయ’ అంటారు. అటు నుంచి చెప్పాలంటే దేవుడు, మాయ, జీవుడు. ఇటు నుంచి చెప్పాలంటే జీవుడు, మనస్సు, దేవుడు! ఈ మనస్సు మంచి కంటే ఎక్కువగా చెడు వైపే మళ్ళుతుంది. సాధారణంగా పరిశీలించుకున్నా సరే, మనకు దగ్గరైన వాళ్లకు ఒంట్లో బాగోలేదని అనుకోండి! మనస్సు ఎలాంటిదంటే కీడే శంకిస్తుంది. శుభంలో కూడా అశుభాన్ని శంకిస్తుంది. దాని లక్షణమే అది. అందుకే చేయవలసిన ప్రార్థన ఏమిటంటే…‘ఏ పాపచింతన కలిగినా నీ పాదం విడువబోను నీలగళాని!’. ‘నీలకంఠుడు అయిన శివుని భార్యవైన పార్వతీదేవీ.. ! ఏ ఆలోచనలైనా రానీ! నీ పాదాలు విడిచిపెట్టను!’ అని దాని అర్థం. ‘పాదాలు విడిచిపెట్టను’ అంటే విగ్రహం దగ్గర కూర్చుంటామని కాదు.
మనస్సులో నామస్మరణ వదలం అని! ‘రేపటి జీవితానికి కాపై నిలబడగదమ్మ కాశీ రాణీ!’ భవిష్యత్తు జీవితం ఎలా ఉంటుందోనన్న భయం అందరికీ ఉంటుంది. గతాన్ని గురించి దుఃఖిస్తారు. భవిష్యత్తు గురించి భయపడతారు. ఈ రెండూ ఒకటే. మూలకారణం ఒకటే! వర్తమానం మీద దృష్టిపెట్టకపోవడం, ‘అలా జరిగి ఉంటే? ఆ పరీక్ష పాసై ఉంటే? ఆ పెళ్లి చేసుకుని ఉంటే?…’ ఇలా జరిగిన వాటి గురించి ఆలోచించడం దండగ. ముందు ముందు పిల్లలెలా ఉంటారో? యువతరం ఎలా ఉంటుందో? అబ్బాయికి పుట్టే మనవడు ఎలా ఉంటాడో? ఇవన్నీ ఎందుకు? కాశీరాణి మనకు కాపుగా నిలిచి కాపాడుతుందని ఆశిద్దాం!