టెలికాం వ్యాపారం నుంచి పూర్తిగా వైదొలగుతున్నట్లు రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్కామ్) ఛైర్మన్ అనిల్ అంబానీ మంగళవారం వెల్లడించారు. భవిష్యత్లో రియల్ ఎస్టేట్ వ్యాపారంపై దృష్టి సారించనున్నట్లు పేర్కొన్నారు. ఈరోజు జరిగిన 14 వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా అనిల్ అంబానీ మాట్లాడారు.
‘2000 సంవత్సరంలో అత్యంత తక్కువ ధరకు టెలికాం సేవలను అందించే లక్ష్యంతో ఆర్కామ్ సేవలను ప్రారంభించాం. కానీ, ఇప్పుడు రూ.40వేలకోట్ల అప్పులు మిగిలాయి. ఇక ఈ రంగంలో కొనసాగకూడదని మేం భావిస్తున్నాం. ఇతర కంపెనీలు కూడా ఇదే విధంగా ఆలోచిస్తున్నాయి. మొబైల్ రంగం నుంచి వైదొలగుతున్నాం. మరో వ్యాపారంలోకి మేము అడుగు పెట్టబోతున్నాం. ఈ కంపెనీకి రిలయన్స్ రియాల్టీ కొత్త ఉత్తేజాన్ని ఇవ్వబోతోంది’ అని పేర్కొన్నారు.
ముంబయి శివార్లలో 133 ఎకరాల్లో విస్తరించి ఉన్న ధీరూభాయి అంబానీ నాలెడ్జ్ సెంటర్(డీఏకేసీ)పై మాట్లాడుతూ.. స్థిరాస్తి వ్యాపారంలో అపరిమిత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. డీఏకేసీ కేంద్రంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు.