అమెరికాలో తెలుగు ఇంజనీర్ కూచిభొట్ల శ్రీనివాస్ ను కాల్చి చంపిన కేసులో నిందితుడు ఎట్టకేలకు కోర్టులో తన నేరాన్ని అంగీకరించాడు. ఇందులో తన తప్పేమీ లేదని మొదటినుంచీ వాదిస్తున్న నిందితుడు ఆడమ్ ప్యూరింటన్.. తాజా విచారణలో తప్పును ఒప్పుకున్నాడు. ఈ కేసులో మే 4న శిక్ష ఖరారు కానుంది. హత్య కేసులో అతడికి జీవిత ఖైదుతో పాటు హత్యాయత్నం ఆరోపణలపై కనీసం 12ఏళ్ల నుంచి గరిష్ఠంగా 54ఏళ్ల వరకూ జైలుశిక్ష పడే అవకాశం ఉంది. ‘‘ఈ రోజు నిందితుడు తన నేరాన్ని అంగీకరించడం నా శ్రీనుని తిరిగి తీసుకురాలేదు. కానీ, జాతి విద్వేషం ఎన్నటికీ ఆమోదయోగ్యం కాదనే బలమైన సందేశాన్ని అందిస్తుంది.’’ అని శ్రీనివాస్ భార్య సునయన దూమాల ఓ ప్రకటనలో పేర్కొన్నారు.