పాకిస్థాన్ జైలులో మగ్గిపోతున్న భారతీయుడు కుల్ భూషణ్ జాదవ్ విషయంలో జరిగిన కుట్రను బలూచిస్థాన్ ఉద్యమకారుడు బయటపెట్టారు. జాదవ్ను ఇరాన్లోని నౌకాశ్రయ పట్టణమైన చాబహార్ నుంచి కిడ్నాప్ చేశారని తెలిపారు. పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) తరపున పని చేస్తున్న అద్దె సైనికులు ఆయనను కిడ్నాప్ చేశారన్నారు.
బలూచిస్థాన్ ఉద్యమకారుడు మమ కదీర్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ పాక్ ఐఎస్ఐ తరపు ముల్లా ఒమర్ బలూచ్ ఇరానీ పని చేస్తున్నాడని చెప్పారు. చాబహార్ నుంచి కుల్భూషణ్ జాదవ్ను ముల్లా ఒమర్ కిడ్నాప్ చేశాడని తెలిపారు.
బలూచిస్థాన్ నుంచి అదృశ్యమైనవారిని అన్వేషించేందుకు ఏర్పాటైన ‘వాయిస్ ఫర్ మిస్సింగ్ బలూచ్స్’కు తాను ఉపాధ్యక్షుడినని మమ కదీర్ చెప్పారు. జాదవ్ కిడ్నాప్ను తమ సంస్థ కార్యకర్తలు చూసినట్లు తెలిపారు. ముల్లా ఒమర్కు ఐఎస్ఐ కోట్లాది రూపాయలు ముట్టజెప్పినట్లు తెలిపారు.
ముల్లా ఒమర్ బలూచిస్థాన్లో ఐఎస్ఐ ఏజెంట్ అనే విషయం అందరికీ తెలిసిందేనని మమ చెప్పారు. పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న బలూచిస్థాన్ కార్యకర్తలను చాలామందిని ముల్లా ఒమర్ కిడ్నాప్ చేశాడని తెలిపారు.