భారత్, పాకిస్తాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరు దేశాలతో వియత్నాంలో గత వారం జరిగిన హనోయ్ సదస్సు వేదికగా అమెరికా సంప్రదింపులు జరిపింది. భారత్, పాకిస్తాన్ ప్రతినిధులతో అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ప్రైవేట్ దౌత్య చర్చలు సాగించినట్టు వెల్లడైంది. చర్చల్లో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ పాల్గొన్నారు.
భారత్, పాకిస్తాన్లతో పాంపియో నేరుగా దౌత్య సంప్రదింపులు జరిపి, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు సమసిపోయేలా కీలకంగా వ్యవహరించారని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి రాబర్ట్ పలాడినో తెలిపారు. ఇరు దేశాల నాయకులతో పాంపియో చర్చలు జరిపారని పేర్కొన్నారు. మరోవైపు భారత గగనతలంపై పాకిస్తాన్ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని ఉపయోగించడం పట్ల ట్రంప్ యంత్రాగం తీవ్రంగా పరిశీలిస్తోందని, ఈ విమానాల వాడకం పరిమితిపై విక్రయ ఒప్పందంలో పొందుపరిచిన నిబంధనల ఉల్లంఘనపై ఆరా తీస్తోందని అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది.