లోక్సభ ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల మధ్య విమర్శల యుద్ధం తారస్థాయికి చేరుతోంది. ఇప్పటికే పలువురు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలవగా.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా మరోసారి ఆ జాబితాలో చేరిపోయారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించే క్రమంలో ముస్లిం లీగ్ ఓ వైరస్ అంటూ ఆయన విరుచుకుపడ్డారు. కేరళలోని వయనాడ్లో ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న రాహుల్ గాంధీ ప్రచార కార్యక్రమంలో పచ్చజెండాలు ఎగరడం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు.
ఈ మేరకు… ‘ 1857లో మంగళ్ పాండే కృషి వల్ల జాతి మొత్తం ఏకతాటిపైకి వచ్చి స్వాత్రంత్ర్యం కోసం ఉద్యమించింది. కానీ ఆ తర్వాత దేశంలోకి ప్రవేశించిన ముస్లింలీగ్ ప్రజలను వర్గాలుగా విడగొట్టింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ర్యాలీలో పచ్చజెండాలు ఎగరడం చూస్తుంటే మళ్లీ పూర్వపు పరిస్థితులు పునరావృతమవుతాయని అన్పిస్తోంది. కాంగ్రెస్ను ముస్లింలీగ్ అనే వైరస్ పట్టిపీడిస్తోంది’ అని అని యోగి ట్వీట్ చేశారు. ‘అటువంటి వైరస్ సోకిన వాళ్లను ఎవరూ రక్షించలేరు. మరి ఇప్పుడు ఈ వైరస్ సోకిన ప్రధాన ప్రతిపక్షం గెలిస్తే ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయో ఒక్కసారి ఆలోచించండి’ అని యోగి ప్రజలకు విఙ్ఞప్తి చేశారు.