హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది రాపోలు భాస్కర్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఐదేళ్లపాటు పదవిలో ఉండేందుకు ప్రజలు ఎన్నుకున్నారని, పదవీకాలం పూర్తి కాకుండానే మంత్రిమండలి తమ ఇష్టానుసారంగా అసెంబ్లీని రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని ప్రధానంగా పిటిషనర్ ఆరోపణ. కేబినెట్ నిర్ణయం, గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం.. ఇవన్నీ రాజ్యాంగ విరుద్ధ చర్యలుగా ప్రకటించాలని పిటిషన్లో కోరారు. మళ్లీ ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో.. ముందస్తుగా ఎన్నికలు నిర్వహించకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరారు. ముందస్తుగా ఎన్నికలకు వెళ్లడం వల్ల రాష్ట్రంలో అసెంబ్లీకి ఒకసారి, పార్లమెంట్కు ఒకసారి.. ఇలా రెండుసార్లు ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుందని, దానివల్ల కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అవుతుందని పేర్కొన్నారు. పిటిషన్పై మంగళవారం విచారణ జరిగే అవకాశముంది.
తెలంగాణ శాసనసభను రద్దు చేస్తూ మంత్రి వర్గం నిన్న ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఆతర్వాత గవర్నర్ ఆమోదం తెలపడం, అసెంబ్లీ కార్యదర్శి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం, ఎన్నికల సంఘానికి సమాచారం అందించడం చక చకా జరిగిపోయాయి.