- మూతబడిన చక్కెర ఫ్యాక్టరీలు తెరిపిస్తా
- నేవల్ బేస్ నిర్వాసితులకు న్యాయం
- ఎలమంచిలి సభలో జగన్ హామీ
ఎలమంచిలి: తాను అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలన్నీ పరిష్కరిస్తానని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అన్నారు. పాదయాత్రలో భాగంగా శుక్రవారం సాయంత్రం విశాఖ జిల్లా ఎలమంచిలి బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తాను అధికారంలోకి వచ్చి న వెంటనే మూతబడ్డ చక్కెర ఫ్యాక్టరీలను తెరిపిస్తానన్నారు. నేవల్బేస్ నిర్వాసితులు, ప్రభావిత ప్రాంతాల మత్స్యకారుల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. బీజేపీతో నాలుగేళ్లు సంసారం చేసిన టీడీపీకి నిర్వాసితుల సమస్యలు కనిపించలేదా అని ప్రశ్నించారు. అచ్యుతాపురంలో ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటుచేసింది తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డేనన్నారు. అందులో బ్రాండిక్స్ కూడా తన తండ్రి హ యాంలోనే ఏర్పాటైందని.. ప్రస్తుతం అక్కడ 16 వేల మంది మహిళా కార్మికులు పనిచేస్తున్నారన్నారు. తాను అధికారంలోకి వచ్చాక బ్రాండిక్స్కు మరిన్ని మేళ్లు చేస్తామని, కార్మికుల జీతాలు పెంచాలని ఒత్తిడి తెస్తామని చెప్పారు. ఎలమంచిలి సభకు నేతలు భారీగా జన సమీకరణ చేశారు. అయితే జగన్ కేవలం ఎనిమిది నిమిషాలే మాట్లాడారు. ‘వర్షం పడుతోంది. నేను తడిచినా పరవాలేదు. మీరంతా తడవకూడదన్న ఉద్దేశంలో ముగించేస్తున్నా..’ అని ప్రకటించారు. అనంతరం పాదయాత్ర ప్రారంభించి.. రాత్రికి రాంబిల్లి మండలం నారాయణపురం చేరుకుని అక్కడ బస చేశారు.