బీజేపీ కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తే.. జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రాతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని ఎత్తివేస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కీలక ప్రకటన చేశారు. గత ఎన్నికల్లో కూడా బీజేపీ తన మేనిఫెస్టోలో ఈ హామీని పొందుపరిచిన సంగతి తెలిసిందే. జార్ఖండ్లోని పాలమావు జిల్లా మెదినినగర్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో అమిత్ షా శనివారం ప్రసంగించారు. ‘మీరు నరేంద్ర మోదీని ప్రధానమంత్రిని చేయండి. మేం ఆర్టికల్ 370ని ఎత్తివేస్తాం’ అని ఆయన ప్రజలనుద్దేశించి పేర్కొన్నారు.
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హయాంలో భారత్ లక్ష్యంగా పాక్లోని ఉగ్రవాదులు తరచూ దాడులు చేసేవారని, ఉగ్రవాదులు మన జవాన్ల తలలు కూడా నరికేవారని పేర్కొన్నారు. ఇప్పుడు పాక్ నుంచి ఒక్క బుల్లెట్ వస్తే.. అందుకు బదులుగా ఏకంగా షెల్ను ప్రయోగిస్తున్నామని చెప్పారు. జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రధాని ఉండాలన్న నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలపై అమిత్ షా తీవ్రంగా మండిపడ్డారు. ఒక్క దేశానికి ఇద్దరు ప్రధానులు ఉంటారా? కశ్మీర్ ఎప్పుడు భారత్లో అంతర్భాగమేనని ఆయన పేర్కొన్నారు.