ఐసీసీ టెస్టు చాంపియన్షిప్ను టీమిండియా నిలబెట్టుకుంది. అంతర్జాతీయ క్రికెట్ టెస్టు ర్యాంకింగ్స్లో టీమిండియా వరుసగా మూడో ఏడాది కూడా నంబర్ వన్ స్థానంలో నిలిచి టెస్టు చాంపియన్షిప్ను మరోసారి చేజిక్కించుకుంది. ఏప్రిల్ 1వ తేదీ నాటికి 116 పాయింట్లతో భారత క్రికెట్ జట్టు మొదటి స్థానంలో నిలిచి వరుసగా మూడో ఏడాది కూడా టెస్టు చాంపియన్షిప్ను గెలుచుకుంది. మిలియన్ డాలర్ల ప్రైజ్మనీని సొంతం చేసుకుంది. తర్వాతి స్థానాన్నిన్యూజిలాండ్ దక్కించుకుంది. ఈ సందర్భంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సంతోషం వ్యక్తం చేశాడు.
‘మాకు చాలా గర్వంగా ఉంది. అన్ని ఫార్మాట్లలోనూ మన జట్టు చక్కని ప్రదర్శన చేస్తోంది. అయితే, టెస్టు ర్యాంకింగ్స్లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవడం కోసం కాస్త ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. టెస్టు క్రికెట్ ప్రాముఖ్యత మనకు తెలుసు. బాగా రాణించిన వారే ముందుకు వెళ్తారు’ అని అన్నాడు.
కాగా, గత కొన్ని సంవత్సరాలు స్థిరంగా ఆడుతున్న న్యూజిలాండ్ జట్టు రెండో స్థానంలో నిలిచింది. 108 పాయింట్ల సాధించిన కివీస్ జట్టు 5లక్షల డాలర్ల ప్రైజ్మనీని సొంతం చేసుకుంది. అంతేకాదు, ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ 2018 సంవత్సరానికి గానూ ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డును సొంతం చేసుకున్నాడు. తమ జట్టు ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో రెండో స్థానంలో నిలవడం నిజంగా అద్భుతమని విలియమ్సన్ ఆనందం వ్యక్తం చేశాడు. ఇక గత రెండేళ్లుగా రెండో స్థానంలో కొనసాగిన దక్షిణాఫ్రికా జట్టు ఈసారి 105 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయింది. ఆ జట్టుకు 2లక్షల డాలర్ల ప్రైజ్మనీ రాగా, ఇంగ్లండ్ 104 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి లక్ష డాలర్లను సొంతం చేసుకుంది.