కంగనా రనౌత్ ఇంకో వారం రోజులు మాట్లాడతారేమో. ఆ తర్వాత సైలెంట్ అయిపోతారు. ఓ పది రోజులు ఆమె మాటలు వినలేం. ఎందుకంటే కంగనా రనౌత్ మాట్లాడకూడదనుకుంటున్నారు. పది రోజుల పాటు నిశ్శబ్దంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 23న కంగనా బర్త్డే. ఈ పుట్టినరోజుకి తనుకు తాను ఇచ్చుకుంటున్న బహుమతి ఈ ‘మౌనం’ అంటున్నారామె. వచ్చే వారం కంగనా కోయంబత్తూర్ వెళ్లనున్నారు. అక్కడ ‘వెల్నెస్’ ప్రోగ్రామ్లో పాల్గొంటారు. వారం పది రోజులు అక్కడ ఉండాలనుకుంటున్నారామె.
అట్నుంచి తన సొంత ఊరు మనాలీ వెళ్లి, అక్కడ కుటుంబ సభ్యుల సమక్షంలో బర్త్డే జరుపుకోనున్నారు. ‘‘కోయంబత్తూర్లో నేను హాజరు కాబోతున్న ప్రోగ్రామ్ చాలా అధునాతనమైనది. ఎప్పటినుంచో వెళ్లాలనుకుంటున్నాను. చివరికి ఈ ఏడాది నా బర్త్డే దగ్గర పడుతున్న సమయంలో కుదురుతోంది. పది రోజుల నిశ్శబ్దం అనేది చాలా పెద్ద నిర్ణయం. ఎంతో నిబద్ధత ఉండాలి. ఇది నా బర్త్డేకి నేను ఇచ్చుకుంటున్న గిఫ్ట్గా భావిస్తున్నాను కాబట్టి ఉండగలుగుతాను అనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు కంగనా రనౌత్.
ఎప్పుడూ ఎవరో ఒకరి గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉండే కంగన పది రోజులు నిశ్శబ్దంగా ఉండాలనుకోవడం అనేది సంచలన నిర్ణయమే. ఇక సినిమాల విషయానికొస్తే.. ‘‘మహిళా యోధుల మీద ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాను. మూడు భాగాలుగా ఈ సినిమా ఉంటుంది. నా జీవితం ఆధారంగా ఓ సినిమా చేయబోతున్నాను. ఇండస్ట్రీలోని వ్యక్తులను బయటపెట్టాలనే ఉద్దేశంతో ఈ సినిమా తీయడంలేదు. నా జీవితంలో జరిగిన అన్ని సంఘటనలు, నేను పడిన కష్టాలను చూపించబోతున్నాను’’ అని చెప్పారు కంగనా రనౌత్.