దుబాయ్: యూఏఈలో అక్రమంగా నివసిస్తున్నవారికి ఉపశమనం కలిగించేందుకు అక్కడి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘యూఏఈ ఆమ్నెస్టీ-2018’ పథకం ప్రారంభమయి సగం కాలం పూర్తైంది. దీంతో దుబాయ్లోని ‘కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా’ అధికారులు ఓ హెచ్చరిక ప్రకటన విడుదల చేశారు. ఆమ్నెస్టీ ద్వారా బయటపడాలనుకుంటున్నవారు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని అక్కడి భారతీయులకు అభ్యర్థించారు. చివరి వరకూ వేచిచూసే ధోరణి మంచిది కాదని హితవుపలికారు. ఆమ్నెస్టీ పథకం ఆగస్టు 1 ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకూ సరైన పాస్పోర్టు లేని 1, 450 మంది ప్రవాస భారతీయులకు ఔట్పాస్ ఇచ్చామని దుబాయ్ ఎంబసీ అధికారులు తెలిపారు. అబుదాబి ఎంబసీ ద్వారా 335 మంది ప్రవాస భారతీయులను దేశం విడిచి వెళ్లారని తెలిపారు. సాధారణంగా చివరి సమయంలో దరఖాస్తు చేద్దామని భావించేవారు ఉంటారని, కావును ఆమ్నెస్టీ దరఖాస్తుదారుల సంఖ్య ఎంతనేది చివరిలో పెరుగుతుందని భావిస్తున్నామని దుబాయ్లోని కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా అధికారి విపుల్ అభిప్రాయపడ్డారు.