తెలంగాణాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ లకు ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలలు పెడుతున్నారు. దాదాపు 500 రెసిడెన్షియల్ స్కూళ్ల స్థాపనకు సర్కారు స్వయంగా తెరతీసింది. ఇది ఎంత అద్భుతమైన ఆలోచన. కానీ అక్కడ చదివేవారు ఎవరు? ఇప్పుడున్న ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలే కదా! ఇప్పటికే ప్రైవేటు పాఠశాలల పోటీ వలన ప్రభుత్వ పాఠశాలలు ఒక్కొక్కొటిగా మూత బడుతున్నాయి. అదొక్కటే కాదు సవాలక్ష సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రజాధనం వృధా అవుతోంది. ప్రస్తుత వర్కింగ్ టీచర్లలో సందేహాలెన్నో.. అవేంటో మీరే చదవండి..
*మూతబడిన పాఠశాలల భవనాలు , స్థలాలు, ఉపాధ్యాయులు, మధ్యాహ్నభోజన కార్మికులను ఏంచేయాలి. కోటానుకోట్ల ప్రజాధనం వ్యర్థం కదా ?
*ప్రభుత్వ పాఠశాలల్లో కొన్నింటిని రెసిడెన్సియల్ ప్రభుత్వ పాఠశాలలుగా మారిస్తే ఎంత ప్రజాధనం మిగులుతుంది?
*ఇప్పుడున్న ప్రభుత్వ ఉపాధ్యాయులను అర్హతల ఆధారంగా తీసుకోవచ్చు కదా! కోట్ల విలువైన పాఠశాల భవనాలు ఉన్నాయి , వాటిని వాడుకోవచ్చు కదా!
*ఇప్పుడు మీరు అన్ని వర్గాలకు కలిపి దాదాపు 500 స్కూల్స్ ప్రకటించారు. అంటే నియోజక వర్గానికి 4, మండలానికి ఒకటి అన్నట్లు. ఇవి చాలవన్నట్లు మోడల్ స్కూల్స్.
*అన్ని వర్గాల పిల్లలు, ధనిక ,పేద తేడా లేకుండా , కుల విచక్షణ లేకుండా అందరు ఒకే రకమైన విద్య , ఒకే దగ్గర చదువుకుంటే ఇక కుల, మతాల కుమ్ములాటలు ఉంటాయా?
*పసిపిల్లల మనసులను కులాలు,మతాలవారీగా విడగొట్టి చదివించడం ఎంత దుర్మార్గం కదా!
*ఇప్పుడు మన సమాజానికి కావలసింది అందరు ఒకే దగ్గర చదివే `కామన్ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్` అది ప్రభుత్వ పాఠశాలల్లోనే సాధ్యం
*విద్యావేత్తలు చుక్కారామయ్యగారు, ఆచార్యకోదండరామ్ గారు మీరైనా ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి గురించి గళంవిప్పండి.
ప్రభుత్వ పాఠశాలల స్థలాలను,భవనాలను, ఉపాధ్యాయులను, మధ్యాహ్న భోజనకార్మికులను కాపాడండి
*అన్ని సంఘాల తెలంగాణా రాష్ట్ర నాయకుల్లారా ఆలోచించండి. ప్రభుత్వ పాఠశాలలను ఏంచేద్దాం?