మనమంతా మన దేశంలో స్వేచ్చగా, ఈలాంటి భయం లేకుండా, రాజ్యాంగం మనకు కల్పించిన
హక్కులన్నింటినీ సంపూర్ణంగా వాడుకుంటూ నేడు దేశంలో స్వేచ్చా జీవిగా విహరించ గలుగుతున్నారంటే అది మనల్ని కంటికి రెప్పలా కాపాడుతూ దేశ భద్రతను తన బుజాలపై మోస్తున్న మన సైనికులదే. ఇక్కడ మనం ఇంత ఆనందంగా పండగ జరుపుకుంటూ బంధు మితులతో ఆనందంగా గడుపుతున్నామంటే అది మన సైనికుల పుణ్యమే. అలాంటి సైనికుడికి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేయండి అంటూ నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన ‘సందేశ్ టు సోల్జర్స్’ ప్రచారానికి మంచి స్పందన వస్తోంది. ఎంతో మంది ట్విట్టర్ వేదికగా జవాన్లకు సెల్యూట్ చేస్తూ.. దీపావళి పండగ శుభాకాంక్షలను తెలుపుతున్నారు. సైనికులకు శుభాకాంక్షలు తెలుపుతూ కొందరు చేసిన ట్వీట్లను ప్రధాని నరేంద్ర మోదీ రీట్వీట్ చేస్తున్నారు. భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సైనికులకు నైతిక మద్దతు ఇవ్వడం కోసం ప్రధాని మోదీ ఇటీవల ఈ ప్రచారం ప్రారంభించారు.