ఒలింపిక్స్లో సింధు గెలుపు మాట ఎలా ఉన్నా.. ప్రస్తుతం మన నేతల పాలిటిక్స్ గురించి ఇంటా బైటా ముచ్చటించుకుంటున్నారు. ఓ క్రీడాకారిణి జీవితాన్ని రాజకీయాలకు ముడిపెట్టేయడం విస్త్రతంగా చర్చకొచ్చింది. మన నేతలు చూపించిన అత్యుత్సాహం టూమచ్ అంటూ విమర్శలొస్తున్నాయి.
సింధు ఇలా మెడల్ అందుకోగానే .. అలా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు లైన్లోకొచ్చేశారు. ఈ గెలుపు నావల్లే అంటూ సక్సెస్ని తన ఖాతాలోకి మళ్లించుకోవాలని చూశారు. ఇక మా అన్నయ్య నిండు మనసుతో గెలవాలని ఆకాంక్షించడం వల్లనే ఈ గెలుపు సాధ్యమైంది అంటూ వైయస్ జగన్ సోదరి షర్మిల చేసిన కామెంట్ చర్చకొచ్చింది. సింధుకి గురువు పుల్లెల గోపీచంద్కి భూములిచ్చి ఎంకరేజ్ చేసింది నేనే అంటూ బాబు అంటే, వైయస్ జమానాలో అవన్నీ లాక్కునేందుకు ప్లాన్ చేశారని కోచ్ గోపిచంద్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహంతోనే.. అంటూ సింధు తండ్రి రమణ అనడం రాజకీయ రంగు పులుముకుంది. ఇలా సింధు మెడల్ చుట్టూ రాజకీయ ఉచ్చు బిగుసుకుంది. ఏదైతేనేం ఓ వర్ధమాన క్రీడాకారిణి వల్ల మన దేశానికి పేరొచ్చింది. అలాంటి 100 మంది సింధులు పుట్టుకురావాలి. రాజకీయాలతో సంబంధం లేకుండా క్రీడలకు ప్రోత్సాహం దక్కాలి. ఎవరి స్వార్థం కోసం వాళ్లు క్రీడాకారులతో ఆడుకోకుండా యువతరాన్ని, ప్రతిభను ఎదగనివ్వాలి.