ఓ వైపు తెలంగాణలో సీఎం కేసీఆర్ వారసుడు కేటీఆర్ మంత్రిగా తారాజువ్వలా దూసుకుపోతున్నాడు. సీనియర్ నేతలకు దొరకనంత పెద్ద టాస్క్ అయిపోయారు కేటీఆర్. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజాసేవలో తాను సైతం అంటూ దూసుకెళ్తున్నారు. భవిష్యత్ సీఎం అభ్యర్థిగానూ అతడి పేరునే ప్రజలు ఫలవరిస్తున్నారు. అయితే వేరొక వైపు ఏపీలో లోకేష్ నాయుడు సీనే వేరుగా ఉంది. అతడికి బోలెడంత ఛాన్స్ ఉన్నా చంద్రబాబు మంత్రిని చేయడంలో తాత్సారం చేయడం భవిష్యత్కు పెను ముప్పు కాబోతోందని రాజకీయనిపుణులు విశ్లేషిస్తున్నారు. చినబాబు ఈపాటికే మంత్రి కావాల్సింది. ఇప్పటికేదో జరిగిపోయింది. ఇక ముందు అయినా బాబు కోలుకొని వచ్చే కేబినెట్ విస్తరణలో అయినా అతడిని మంత్రి వర్గంలో చేర్చుకుంటే .. ఉపయోగం ఉంటుందని తేదేపా నేతలే అంటున్నారు. అయితే అదే సమయంలో వేరొక విశ్లేషణ కూడా తెరపైకొచ్చింది.
లోకేష్ ఇప్పుడు మంత్రి వర్గంలోకి వచ్చినా అతడు చేసేదేం ఉండదు. రాబోవు ఎన్నికలకు ఇంకా మిగిలి ఉన్నది మూడేళ్లు. ఆర్నెళ్ల ముందే ఎన్నికల కోడ్ వర్తిస్తుంది కాబట్టి ఆ సమయాన్ని తీసేస్తే ఇక మిగిలేది రెండున్నరేళ్లు. ఈ కాలంలో లోకేష్ చేసేదెంత? మంత్రిగా తనదైన మార్క్ వేయాలంటే ఆ టైమ్ సరిపోతుందా? అంటూ విశ్లేషిస్తున్నారు. అధికారంలో ఉండీ రాహుల్గాంధీ విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం, సోనియా చేసిన తప్పును గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు అదే రిపీట్ చేస్తున్నారని అంటున్నారు. సేమ్ సీన్ లోకేష్ విషయంలోనూ రిపీటవుతోంది. ఇప్పటికే ఆలస్యమైంది. ఇకనైనా బాబు తీక్షణంగా ఆలోచిస్తే మంచిదని సెలవిస్తున్నారు. మరి పెదబాబు, చినబాబు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.