నాగార్జున హథీరాం బాబా పాత్రలో నటిస్తున్న చిత్రం `ఓం నమో వేంకటేశాయ`. రాఘవేంద్రరావు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఏఎన్నార్ కూడా ఓ పాత్రలో కనిపించబోతున్నారని ప్రచారం సాగుతోంది. ఏఎన్నార్ మన నుంచి దూరమై చాలా రోజులైంది. మరి ఈమధ్యే మొదలైన `ఓం నమో వేంకటేశాయ`లో ఆయనెలా కనిపిస్తారనేదేగా మీ సందేహం. త్రీడీలో ఏఎన్నార్ని సృష్టించ బోతున్నారట. అందుకోసం రాఘవేంద్రరావు సాంకేతికబృందంతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఈమధ్య కోడి రామకృష్ణ కన్నడంలో తెరకెక్కించిన ‘నాగాభరణం’ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ విష్ణువర్థన్ని త్రీడీలో సృష్టించి తెరపై చూపించారట. అదే తరహా ప్రయోగం రాఘవేంద్రరావు కూడా చేయబోతున్నట్టు ప్రచారం సాగుతోంది. మరి అందులో నిజమెంతన్న విషయంపై కొన్నాళ్లాగితేనే స్పష్టతవస్తుంది.