ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా ఉన్న నరసింహన్ కు అమితమైన దైవ భక్తి. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ఉత్సవాలు ఎక్కడ జరిగిన కూడా ఆయన తన కుటుంబసభ్యులతో కాకపోయినా కూడా, తాను మాత్రం తప్పక హాజరు అవుతుంటారు. అలాగే తమిళనాడు తిరువళ్ళూరులోని వీరరాఘవ దేవాలయానికి ఆయన ప్రతీ మూడు నెలలకు ఓ సారి వెళ్ళి దైవదర్శనం చేసుకువస్తుంటారు. ఎప్పటి లాగే ఈసారి కూడా దైవదర్శనం కోసం వెళ్ళిన గవర్నర్ కు ఈ సారి వింత అనుభవం ఎదురయ్యింది.
గురువారం దర్శనం ముగించుకొని నరసింహన్ వస్తుండగా, స్దానిక మీడియా ప్రతినిధులు ఆయన్ను ఒక్కసారిగా చుట్టుముట్టి, శేషాచల అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ పై స్పందించవలసిందిగా కోరారు. అయితే అందుకు ఆయన నిరాకరించారు. దీంతో మీడియా ప్రతినిధులను భద్రతా సిబ్బంది పక్కకు నెట్టివేయటంతో కాసేపు వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తప్పక స్పందించాలని మీడియా పట్టుబట్టడం తో ‘నో కామెంట్స్’ అంటూ వెళ్ళిపోయారు. మరోవైపు శేషాచల అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ తో తమిళనాడు లోని ప్రజలు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారి ఆస్తులను ద్వంసం చేస్తున్నారు. తమిళనాడు, ఆంధ్ర సరిహద్దుల్లో ఇంకా ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది.