నటించింది నాలుగే .. కానీ లాగేస్తోంది కోటిన్నర!! ఇది నిజంగానే సర్ప్రైజ్ అనే చెప్పాలి. ఓ అప్కమ్ హీరోయిన్కి అంత పెద్ద పారితోషికమా? టాలీవుడ్ కళ్లు భైర్లు కమ్మే ట్రీట్ ఇది. అయినా అంత పెద్ద మొత్తం ఎలా అడిగింది.. అంత పెద్ద డిమాండ్కి ఎలా అంగీకరించారు? అయినా మరీ అంత ఆశ ఎందుకు?… దీపం ఉండగానే దోపిడీ ఏందమ్మో? అసలింతకీ ఎవరీ ముద్దుగుమ్మ… ఏమా దోపిడీ కథ.. చెక్ దిస్ స్టోరీ..
నవతరం హీరోయిన్ల స్పీడు చూస్తుంటే కళ్లు భైర్లు కమ్మాల్సిందే. నటించేది నాలుగు సినిమాలే కానీ పారితోషికాలు మాత్రం కోట్లలో. ఇది టాలీవుడ్లో తాజా పరిణామం. ఊహించని ఊహాతీతమైన సన్నివేశం ఇదని లబోదిబోమంటున్నారు కొందరు. కొందరైతే ఈ కొత్త పరిణామంపైనా… నవతరం నాయికల డిమాండ్ల పైనా ఒకటే గుర్రుమీదున్నారు. ప్రస్తుతం జోరుమీదున్న ఓ నలుగురైదురు కథానాయికల తీరుతెన్నులపైనా టాలీవుడ్లో చర్చకొచ్చింది. బన్ని సరసన `డీజే-లో నటిస్తోంది పూజా హెగ్డే. ఆ సినిమాకి పారితోషికం మాటేమో కానీ.. ఈ అమ్మడు ఓ కుర్ర హీరో సినిమా కోసం అందుకుంటున్న పారితోషికం కథ వింటే దిమ్మ తిరిగిపోతోంది. పూజా తదుపరి సినిమా కోసం ఏకంగా 1.20 కోట్లు అందుకుంటూ ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. ఆవిడ పెంచిన హీట్ అంతా ఇంతా కాదు. ఈ హీట్ ఇతర నాయికల్ని తాకుతోంది. ముకుంద, ఒక లైలా కోసం, మొహంజోదారో లాంటి క్రేజీ సినిమాల్లో నటించిన పూజా హెగ్డే ఆ తర్వాత టాలీవుడ్లో వరుస సినిమాలతో దూసుకెళ్లిపోతోంది. పోనీ ఆ మూడు సినిమాలతో పొడిచేసిందా? అంటే అబ్బే.. అంత సీనే లేదు ఈ అమ్మడికి.. అయినా.. అడగాల్సినంతా అడిగేస్తోంది. మొహమాటానికి ఏమాత్రం ఆస్కారం లేదంటోంది. దొరికినంతా దోచుకో.. దోచినంతా దాచుకో.. అన్న ఏకైక ఫార్ములానే సదరు ముద్దుగుమ్మ ఏమాత్రం మొహమాటం లేకుండా అనుసరిస్తోంది. దీనిపై టాలీవుడ్లో ఓ సెక్షన్ గుర్రుగానే ఉంది. ఓ అప్కమ్ హీరోయిన్కి అంతెందుకు? అంటూ కూనిరాగాలు తీస్తున్నారు కొందరు నిర్మాతలు. డీజే తర్వాత అల్లుడు శీను క్రేజీగా పూజా వెంటపడ్డాడు. దాని ఫలితమే ఈ డిమాండ్ అని చెబుతున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కనున్న కొత్త సినిమాలో పూజా హెగ్డేని ఏరి కోరి ఎంచుకున్నారు. ఇంకేం ఉంది.. ఈ భామ ఛాన్స్ దొరికిందే తడవుగా.. పారితోషికంగా.. ఏకంగా 1.50 కోట్లు .. డిమాండ్ చేసిందిట. అంతేకాదు.. దానిపై పన్ను చెల్లించాల్సిందిగా నిర్మాతలకు మెలిక వేసిందిట. వాస్తవానికి బన్నితో సినిమా తర్వాత బాలీవుడ్కే పరిమితమవ్వాలనేది పూజా ప్లాన్ . కానీ బెల్లంకొండ ఏరికోరి ఈ అమ్మడిని భారీ పారితోషికానికి ఒప్పించారుట. చివరికి పూజా 1.20 కోట్ల పారితోషికానికి కమిటైందని తెలుస్తోంది.
అల్లు అర్జున్ సరసన నటిస్తున్న డీజే కోసం పూజా హెగ్డే కేవలం 55 లక్షల మేర అందుకుంటోంది. దాంతో పోలిస్తే ఆల్మోస్ట్ బెల్లంకొండ సినిమాకి రెట్టింపు పారితోషికమే. కానీ ఓ అప్కమ్ హీరోయిన్కి అంత పెద్ద మొత్తం ఎందుకు? ఈ విషయంలో నిర్మాతల మండలిలో కానీ, సినీ ఇండస్ట్రీ రెమ్యునరేషన్ వింగ్లో కానీ ఎలాంటి అభ్యంతరం లేకపోవడం కూడా ప్రస్తుతం చర్చకొచ్చింది. రెమ్యునరేషన్లు పెరిగిపోతున్నాయ్.. కాస్ట్ ఫెయిల్యూర్ ఎదురవుతోంది.. అంటూ కూనిరాగాలు తీసే మన నిర్మాతలే ఇందుకు ఆస్కారం ఇస్తున్నారు. లేనిపోని కమిట్మెంట్లకు పోయి అటుపై మూతి కాల్చుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
అయితే ఈ వరుస .. ఈ డిమాండ్ ఇక్కడితో ఆగిపోతుందా? రేస్లోకొచ్చిన ప్రతి హీరోయిన్కి ఇదే రివాజుగా మారడం ఖాయం అన్న టాక్ వినిపిస్తోంది. పూజా హెగ్డే ఇన్స్పిరేషన్తో ఇతర కథానాయికలు తమ పారితోషికాల్ని పెంచేసే అవకాశం ఉందన్న మాటా వినిపిస్తోంది. ఇప్పటికే మరో అప్ కమ్ హీరోయిన్ కీర్తి సురేష్ .. ఇదే తరహాలో 2-3 కోట్లు డిమాండ్ చేయడంపైనా ఇదివరకూ ఫిలింసర్కిల్స్లో చర్చకొచ్చింది. కీర్తి సురేష్ చేతిరేఖలు ఓ రేంజులో ఉన్నాయి. ఈ నవతరం నాయిక స్కైలో ఉందన్న టాక్ వినిపిస్తోంది. కీర్తి ఒక్కో కమిట్మెంట్కి 2 కోట్లు పైగానే అందుకుంటోందన్న టాక్ ఔరా! అనిపిస్తోంది. కీర్తి నటించిన సినిమాలన్నీ వరుసగా సక్సెస్లు సాధిస్తుండడంతో ఈ రేంజులో డిమాండ్ పెంచేసిందిట. ప్రస్తుతం నటిస్తున్న `సావిత్రి` కోసం, పవర్స్టార్ సరసన త్రివిక్రమ్ దర్శకత్వంలోని సినిమాకి పూజా ఓ రేంజులోనే కోట్ చేసిందిట. ఇక ఇతర హీరోయిన్లలో రకూల్ ప్రీత్సింగ్, రాశీ ఖన్నా సైతం కోటి పైగా డిమాండ్ చేయడం ఇటీవల చర్చకొచ్చింది. రకూల్ రేంజ్ ధృవ లాంటి బ్లాక్బస్టర్ తర్వాత ఆల్మోస్ట్ డబుల్ అయ్యిందన్న టాక్ వినిపించింది. ఈ అమ్మడు ఇప్పటికే కోటిన్నర రేంజుకు చేరుకుందని.. 2 కోట్లకు అటూ ఇటూగా డిమాండ్ చేస్తోందని మీడియాలో కథనాలొచ్చాయి.
అయితే ఈ భామలంతా అనుష్క, కాజల్, సమంత, తమన్నా, త్రిష రేంజు దాటుకుని వెళ్లిపోవడం.. అది కూడా ఇంత షార్ట్ స్పాన్లో అంత పెద్ద మొత్తం డిమాండ్ చేయడం అన్నది టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఈ సీనియర్ నాయికలంతా దశాబ్ధం పైగానే కెరీర్ని సాగించి అంత పెద్ద మొత్తాలు అందుకుంటున్నారు. కోటి నుంచి రెండు కోట్ల మేర పారితోషికాలు డిమాండ్ చేశారు. కానీ నాలుగైదు సినిమాలు .. లేదా 10 సినిమాల్లోపు నటించిన కిడ్స్ మరీ కోటి పైగా పారితోషికం డిమాండ్ చేయడం అంటే అది ఆలోచించాల్సిందే. ఇచ్చేవాళ్లుంటే మాకేంటి నొప్పి అన్నట్టే ఉంది వ్యవహారం. ఇలాంటి వాటిని మానిటరింగ్ చేసేందుకు ఎలాంటి కమిటీలు కానీ, ఎలాంటి శాఖలు కానీ టాలీవుడ్లో లేకపోవడం హాస్యాస్పదం అవుతోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకునే బ్యాచ్ సినిమాలు తీస్తే ఇలానే ఉంటుందన్న విమర్శలు పోటెత్తుతున్నాయ్.