కాశ్మీర్ పేరు వింటే చాలు ప్రకృతి సౌందర్య వీథుల్లో విహరిస్తున్న దృశ్యమే కనురెప్పల మాటున కదలాడుతుంది. అదికూడా డాల్ లేక్ తీరాన పలు వర్ణాల్లో ఆహ్వానం పలికే టులిప్ గార్డెన్ను చూస్తే… ఆహా! చూస్తే ఏంటి… చూడాల్సిందే. ఆసియాలోనే అతిపెద్దదైన ఈ టులిప్ పూలవనంలోకి అడుగుపెట్టగానే ఎరుపు, పసుపు, గులాబీ, తెలుపు, ఆరెంజ్, లేతనీలం, మెజెంతా రంగులు పలకరిస్తాయి. ప్రధానంగా కనిపించే ఈ రంగులే కాకుండా మరెన్నో రంగులు కనువిందుచేస్తాయక్కడ. పచ్చని తివాచీ పరిచిన కొండల నడుమ గాలికి వయ్యారంగా కదులుతూ టులి్పలు మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. టులిప్ పూల ఫెస్టివల్ ప్రతి ఏడాది ఏప్రిల్ నెలలో జరుగుతుంది. ఈ సీజన్లోనే పువ్వులు బాగా వికసించి దూరంనుంచి చూస్తే రంగురంగుల సిల్క్ తివాచీ పరిచినట్టే కనిపిస్తుంది. అందుకని ఏప్రిల్ – మే నెలల్లో టులిప్ పూబాలల ఉద్యానవనాన్ని సందర్శిస్తే ప్రకృతి ఒడిలో పరవశించిపోవచ్చు. ఐదు హెక్టార్ల విస్తీర్ణంలో 60 రకాలతో ఉండే టులిప్ గార్డెన్ను జీవితంలో ఒక్కసారన్నా చూడాల్సిందే. ఈ పూవులు ఉష్ణోగ్రతను బట్టి 15 నుంచి 20 రోజులు వికసించి ఉంటాయి.