మన పొరుగుదేశం చైనా అవకాశం చిక్కితే చాలు ఇండియాపై విషం చిమ్మేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఇండియా పురోగతి సాధించే ఏ పనినైనా సరే దానికి అంతర్జాతీయ వేదికలపై అడ్డుపుల్ల వేస్తూ ఉంటుంది. అసలు ఇండియా అంటే చైనాకు ఉన్నది కోపమా లేక భయమా?
చైనా ఇండియాను వ్యతిరేకించడానికి దానికున్న భయమే కారణమంటున్నారు అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు. తాజాగా న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ (ఎన్ఎస్ జీ ) లో ఇండియా సభ్వత్యాన్ని చైనా అడ్డుకుంది. ఇక ముందు కూడా ఎన్ఎస్ జీ లో ఇండియా ప్రవేశించకుండా నిలువరించేందుకు మిగతా దేశాల మద్ధతు కూడగట్టడంలో ప్రస్తుతం యమ బిజీగా ఉంది.
అసలు ఇండియా అంటే చైనాకు ఎందుకంత కోపం అంటే దానికి సవాలక్ష కారణాలున్నాయని చెపుతున్నారు అంతర్జాతీయ రాజకీయ నిపుణులు. ప్రస్తుతం ఆసియాలో బలమైన శక్తిగా ఉన్న చైనా ఈ ఖండంలో తనకు ఎదురు ఉండకూడదు అనుకుంటోంది. అయితే అంత భారీ స్థాయిలో కాకున్నా చైనాకు సమానంగా ఎదుగుతూ వస్తోంది. ముఖ్యంగా ఆర్థికంగా బలపడటంలోనూ, ఆయుధాలను సమకూర్చుకోవడం లోనూ ఇండియా కాస్త ధీటుగానే ఉంది. ఇది చైనాకు మింగుడుపడటం లేదు. పొరుగునే ఉన్న భారతదేశం బలపడటం చైనాకు ఏ మాత్రం ఇష్టం లేదు. గతంలో ఇండియాను మెతక వైఖరి కల్గిన నేతలు పాలించడంతో చైనాకు ఎదురు లేకుండా పోయింది. అయితే గడిచిన కొన్నాళ్లుగా ఇండియా వేగంగా అభివృద్ధి సాధిస్తూ ఉండటం చైనాకు మింగుడుపటడం లేదు.
ఇండియా అభివృద్ధిని నెమ్మదింపజేసేందుకు పాకిస్థాన్ తో చేతులు కలిపిన చైనా ఎప్పటికప్పుడు తన దుష్ట బుద్ధిని బయటపెట్టుకుంటూనే ఉంది. తీవ్రవాదులకు సహాయం చెయ్యడం, వారికి నిధులు అందించడం వంటి చర్యలకు పాల్పడుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా ఇండియా కూడా చైనాకు ధీటుగా ఆయుధ సంపత్తిని సమకూర్చుకుంటోంది. ఇది కూడా చైనాకు సహించడం లేదు. దీంతో అంతర్జాతీయ వేడుకలపై ఇండియాను అడ్డుకోవడం, వ్యతిరేకించడం అలవాటుగా మార్చుకుంది. చైనా మీడియాలో వచ్చే కథనాలు చూస్తే ఇండియాపై వారి వైఖరి అర్ధమవుతుంది. ఇండియా 1962 నాటి మైండ్ సెట్ లోనే ఉందని, భారతీయులు చైనాను వ్యతిరేకిస్తున్నారని చెపుతోంది.ఇండియా ఆయుధాలను పెంచుకోవడం మాని తమతో పరస్పర వ్యాపారానికి సహకరించాలని అంటోంది.
ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ అయిన ఇండియా వ్యాపారం చేసుకోవడానికి కావాలి కానీ ఇండియా మాత్రం ఏ విధంగా బలపడకూడదని అక్కడి మీడియా చెపుతోంది. ఎన్ఎస్ జీలో ఇండియా సభ్యత్వాన్ని అడ్డుకుంటూనే ఉంటామని బాహాటంగా చెపుతోంది. ఎన్ఎస్ జీ లో వస్తే ఇండియా న్యూక్లియర్ టెక్నాలజీని ఇండియా దుర్వినియోగం చేస్తుందని వాదిస్తోంది. ఇండియా ఇప్పటివరకూ దురాక్రమణ జరిపిన సందర్భాలు ఒక్కటి కూడా లేదు. అదే చైనా మన దేశంతో పాటు టిబెట్, తైవాన్, వియాత్నం దేశాలపై ఎన్నో దురాక్రమణలు జరిపింది. ఇది చైనా రెండు నాల్కల ధోరణికి పరాకాష్ఠ.
చైనా ధీటుగానే ఎదుర్కొవడంలో ఇండియాది ముందు నుంచి వెనుకబాటే. నెహ్రూ నుంచి నిన్న మొన్నటి పాలకుల వరకూ అందరూ చైనా బెదిరింపులకు తలొంచిన వాళ్లే. కానీ గడిచిన కొన్నాళ్లుగా క్రమంగా మార్పు వస్తోంది. చైనాకు మాటకు మాట చెప్పడం. ఎదిరించి నిలబడటం వంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో పాటు వియాత్నాం కు క్షిపణులను విక్రయించి చైనా దూకుడుకు కళ్లెం వేయాలని కూడా ఇండియా భావిస్తోంది. చైనా వ్యతిరేకించినా వియాత్నాం కు క్షిపణులను అమ్మడం మాత్రం ఖాయమని ఇండియా స్పష్టం చేసింది. చైనా విషయంలో ఇండియా ధైర్యం ప్రదర్శిస్తుందడానికి ఇదే పెద్ద ఉదాహరణ. మెత్తగా ఉంటే మొత్తబుద్దవుందని ఊరికే అన్లేదు. మెతకగా ఉన్నంతకాలం చైనా ఇండియాపై ఇలా విషం కక్కుతూనే ఉంటుంది. వ్యూహాత్మక దూకుడుతోనే దీనికి చెక్ పెట్టాల్సి ఉంది.