తేరాసకు ముప్పు తిప్పలు పెట్టాలంటే గద్వాల రాణి, ఎమ్మెల్యే డీకే అరుణ బరిలో దిగాల్సిందే. కాంగ్రెస్ తరపున బలమైన వాణి వినిపించే సీనియర్ నేతగా అరుణకు పేరుంది. కాంగ్రెస్లో ఎందరు సీనియర్ నేతలు ఉన్నా మహిళా నేతగా తనకంటూ ఓ ప్రత్యేకతను మాట తీరుతోనే ఆపాదించుకున్నారు. కేసీఆర్ అంతటివాడినే ఢీకొట్టే నేతగా పాపులారిటీ సంపాదించుకున్నారు అరుణ.
అయితే ఇటీవలి కాలంలో గద్వాల్ ప్రత్యేక జిల్లా కోసం డీకే బోలెడంత పోరాటం చేసిన సంగతి తెలిసిందే. మహిళా ఎమ్మెల్యే ధీక్షలు, పోరాటాలు ఫలించి చివరికి సీఎం దిగి వచ్చి గద్వాల్ని కొత్త జిల్లాగా ప్రకటించారు. అయితే ఇదంతా బాగానే ఉంది కానీ, ఈ కొత్త జిల్లా వల్ల అరుణక్క ప్రాబల్యం పరిమితమైంది.
మహబూబ్నగర్ లాంటి పెద్ద జిల్లా ఇప్పుడు లేదు. జిల్లాల `సైజు’ తగ్గిపోవడంతో తన ఉనికి కూడా కుంచించుకుపోయింది. ఇప్పుడు ప్రత్యర్థి జూపల్లితో వార్ అక్కర్లేదు. ఎందుకంటే అతడు నాగర్ కర్నూల్కు పరిమితం. ఇక వనపర్తిలో చిన్నారెడ్డి హవా సాగుతుంది. కాబట్టి ఏ కోణంలో చూసినా మహబూబ్ నగర్ ఇలాకాలోనే డీకే హవా పరిమితం అయిపోయినట్టేనని విశ్లేషిస్తున్నారు. అయితే కొత్త జిల్లా పేరుతో ఇదంతా కేసీఆర్ ఆడిన మైండ్ ప్లే అని కూడా మరో వైపు వినిపిస్తోంది.