చెల్లెమ్మా.. అంటూ ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు కీ.శే.వైయస్ రాజశేఖర్రెడ్డి. చేవెళ్ల చెల్లమ్మగా ప్రసిద్ధి గాంచిన సబితా ఇంద్రారెడ్డి వైయస్కి అత్యంత ఆప్తురాలన్న సంగతి తెలిసిందే. రాజశేఖర్రెడ్డి హయాంలో సబితా ఇంద్రారెడ్డి హోంమంత్రిగానూ పనిచేశారు. అసలు వైయస్ని ఎవరైనా ఏదైనా అంటే వెంటనే కౌంటర్ వేయనిదే నిద్రపోరు సబిత. లేటెస్టుగా దివంగత నేత వైయస్సార్ని తేరాస నేతలు విమర్శించినందుకు .. చేవెళ్ల చెల్లెమ్మ తనదైన శైలిలో ప్రతిదాడి చేశారు.
వైయస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీఇంబర్స్ మెంట్ ప్రభుత్వానికి గుదిబండలా మారాయంటూ ఇటీవలే కేటీఆర్ వ్యాఖ్యానించడాన్ని సబిత తప్పు బట్టారు. ఆ మాటతోనే కేసీఆర్ ప్రభుత్వ విధివిధానాలు అర్థమై ఉండాలి. లక్షల మందికి ప్రాణం పోసి .. ఎందరో పేదల జీవితాల్లో వెలుగులు నింపిన పథకాల్ని తప్పు పట్టారంటే కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆలోచనా విధానం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అంటూ సబిత ఫైరయ్యారు. ఫీజు రీఇంబర్స్మెంట్కి నిధులు లేవు కానీ కూతురు కవిత బతుకమ్మ ఆడేందుకు మాత్రం నిధులు పుట్టుకొస్తాయని విమర్శించారు. హైదరాబాద్లో రోడ్లను చూస్తే కేటీఆర్ పనితీరు అర్థమవుతుందని అన్నారు. తనని తేరాసలోకి రమ్మని పిలిచినా వెళ్లలేదని గుర్తు చేశారు. వైయస్ని అన్నందుకు తేరాసకు చెందిన మొత్తం చిట్టా చదివేశారు చెల్లెమ్మ.