ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ కమ్యూనిస్టు సీనియర్ నేతను టార్గెట్ చేశారా? అంటే అవుననే సదరు నేత ఆవేదనను బట్టి అర్థం చేసుకోవాల్సొస్తోంది. తెలంగాణలో ఆయన మహాజన యాత్ర పేరుతో పాదయాత్ర ప్రారంభించారు. ఈ పాదయాత్ర సమయంలో సరైన రక్షణ కల్పించలేదన్నది ప్రధాన ఆరోపణ. అలాగే పాదయాత్ర అని ప్రకటించగానే సదరు నేతకు ఉన్న గన్మెన్లను సైతం ఉపసంహరించారు. దీంతో ఇదంతా తెలంగాణ సీఎం ఉద్ధేశపూర్వకంగా చేస్తున్న కుట్రేనని ఆరోపిస్తున్నారు.
తన రక్షణకు సంబంధించి సిబ్బంది ఉపసంహరణపై ఆయన గుర్రుగా ఉన్నారు. తిరిగి గన్మెన్లను కేటాయించాల్సిందిగా లేఖ రాస్తే పట్టించుకోలేదన్న ఆగ్రహంతో ఉన్నారు. ఇవే విషయాల్ని మీడియాకి బహిరంగంగానే చెబుతున్నారు. ఆవేదన వెల్లగక్కుతున్నారు. అసలింతకీ ఆయనెవరో ఈ పాటికే అర్థమై ఉండాలి. ఆయనే జాతీయ పార్టీ అయిన సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం. తన పాదయాత్రను అడ్డుకునేందుకు సీఎం కుయుక్తులు పన్నారన్నది ఆయన ప్రధాన ఆరోపణ.