కాపు రిజర్వేషన్ల విషయంపై ముద్రగడ పద్మనాభం తన పోరాటాన్ని గడిచిన కొన్ని నెలలుగా తీవ్రతరం చేస్తున్నారు. విభిన్న పద్ధతుల్లో ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కాపు రిజర్వేషన్ ను సాధించాలని ముద్రగడ ప్రణాళికలు వేస్తున్నారు. అయితే ఈ ఎపిసోడ్ లో దాసరి పాత్ర కూడా కీలకంగా మారింది. ఉద్యమం మెదటి నుంచి దాసరి, ముద్రగడకు తన సహాయ సహకారాలు అందిస్తున్నారు. అయితే ఇందులో దాసరికి దీర్ఘకాలిక రాజకీయ వ్యూహాలు దాగున్నాయని చెప్పుకుంటున్నారు. గడిచిన కొన్నేళ్లుగా దాసరి రాజకీయాల్లో పెద్దగా రాణించలేకపోయారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు అంటుకున్న బొగ్గు మకిలితో ఆయన నానా ఇబ్బందులు పడుతున్నారు.
ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఎటువంటి సహాయ సహకారాలు అందించలేదు. దీంతో బొగ్గు కేసు ఆయన రాజకీయ భవిష్యత్ ను ఇబ్బందుల్లోకి నెట్టింది. ఈ నేపథ్యంలో ముద్రగడ పథ్మనాభం లేవనెత్తిన కాపు ఉద్యమంతో దాసరి మరోసారి రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. కాపు నేతగా ఆ సామాజిక వర్గంలో తన పట్టు పెంచుకునేందుకు దాసరికి ఇంతకంటే మంచి అవకాశం రాదు. ఈ విషయం దాసరికి కూడా తెలుసు. అందుకు కాపు రిజర్వేషన్ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించేందుకు, ప్రజల్లో తిరిగి తన పాపులారిటీని పెంచుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. మరి ఈ విషయంలో దాసరి వ్యూహాలు ఫలిస్తాయా లేక కాపు ఉద్యమాని వేరే ఎవరైనా హైజాక్ చేసి ఆ క్రెడిట్ ను కొట్టేస్తారా అన్నది వేచి చూడాలి.