తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం..మర్డర్ మిస్టరీ తో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాన్ని తలపిస్తోంది. కథలో కొత్త క్యారెక్టర్లు, ఊహించని ట్విస్ట్ లు.. ఈ వ్యవహారం ఇప్పుడు ఇలాగే సాగుతోంది.జయలలిత డిసెంబర్ 5 న మరణించారు. ఆమె ఆసుపత్రిలోనే మరణించినా లోపల ఏం జరిగిందనే విషయం మాత్రం సామాన్య ప్రజలకు తెలియదు.పలువురు ప్రముఖులు జయలలిత మరణం పై పలు ఆసక్తికర అనుమానాలను వ్యక్తం చేసారు.ఈ అనుమానాలు ప్రజల్ని ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఈ తరుణంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. పోయెస్ గార్డెన్ లో జరిగిన వివాదంలో ఎవరో జయని కిందకు తోసేయడం వల్ల మరణించారని అప్పటి అన్నా డీఎంకే నేత పాండియన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం ఈయన పన్నీర్ సెల్వం వర్గంలో ఉన్నారు. పన్నీర్ సెల్వం, శశికళ మధ్య వివాదం రాజుకున్న తరువాత.. అమ్మ మరణంపై దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు.
ఇదిలా ఉండగా ఆ మధ్యన జయలలిత కూతురు ఈమే అంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ఇప్పుడు జయలలిత కొడుకుని తానే అని ఆమె ఆస్తులన్నింటికీ తాను ఏకైక వారసుడినని ఓ వ్యక్తి తెరపైకి వచ్చాడు. జయలలిత అసలైన కొడుకుని తానే అని, ఆమెని హత్య చేసారని చెన్నైలోని ఈరోడ్ కు చెందిన కృష్ణ మూర్తి అనే వ్యక్తి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కి ఫిర్యాదు చేశాడు. జయ మరణం విషయంలో పాండియన్ చెప్పిన కథనే ఇతడు కొంచెం ఘాటుగా చెప్పాడు. జయలలితను పోయెస్ గార్డెన్ నుంచి కిందకు తోసేయడం వల్ల మరణించారన్న విషయం వాస్తవమని అన్నాడు. తాను జయలలిత స్నేహితురాలు వనితామణి ఇంట్లో తన పెంపుడు తల్లిదండ్రుల వద్ద ఉంటున్నానని తెలిపాడు. తాను చివరగా జయలలితని 2016 సెప్టెంబర్ 14 న కలిసినట్లు తెలిపాడు. ఆమె తనని త్వరలో ప్రపంచానికి తన వారసుడిగా ప్రకటించాలనుకుందని ఆ విషయం లోనే జయలలిత, శశికళ మధ్య వాగ్వాదం జరిగిందని అన్నాడు. ఆ సమయంలోనే శశికళ.. అమ్మని మెట్ల మీది నుంచి తోసేసి హత్య చేసిందని ఆరోపించాడు.
తన ప్రాణాలకు ముప్పు ఉంటుందనే భయంతోనే ఈ విషయాన్ని ఇన్ని రోజులూ చెప్పలేదని.. చివరకు ఎలాగో ధైర్యం చేసి చెబుతున్నానని కృష్ణ మూర్తి అన్నాడు. సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామికి కృష్ణ మూర్తి లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఆయన సలహా మేరకే కృష్ణ మూర్తి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు.