‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని.. నిలుపరా నీ జాతి నిండు గౌరవమును..’ అని అన్నారు రాయప్రోలు సుబ్బారావు. ఆ మాటలకే తీట్లు పొడిచే రాజకీయాలు నడుస్తున్నాయ్!
ఇక్కడ ఏకంగా దేశం పరువు బజారుకీడ్చే సన్నివేశమే కనిపిస్తోందని విమర్శలొస్తున్నాయ్. అన్నదమ్ముల్లా కలిసుండాల్సిన సీఎంలు ఇద్దరు ఒకరిపై ఒకరు రచ్చకెక్కుతూ నిత్యం వార్తల్లో నానుతున్నారు. ప్రాజెక్టుల్లో కొట్లాట.. పెట్టుబడుల్ని రప్పించుకోవడంలో కొట్లాట. విదేశీ పర్యటనల్లో పోటీ తత్వం.. భవంతుల నిర్మాణంలో హడావుడి .. ఒకటేమిటి ఏది చేస్తున్నా ఆ ఇద్దరి మధ్యా కొన్ని వింత పోకడలకు పోవడం బాలేదంటూ జనం నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోటీ ఉండాలి. అయితే అది ఆరోగ్యకరంగా ఉండాలి. అలా కాకుండా నీతి నియమాలు మరిచి.. సోదర భావం లేకుండా ఇలా ఒకరిపై ఒకరు బురద జల్లుకునేలా ప్రవర్తించడం తగదని పలువురు హితవు పలుకుతున్నారు. అంతేనా విదేశాల నుంచి ఎవరైనా ప్రతినిధి కానీ, ఎన్నారై కానీ వచ్చి సొంత గడ్డపై పెట్టుబడి పెడదాం.. అనుకుంటే మేమున్నాం అంటూ రెడ్ కార్పెట్ వేస్తూనే పొరుగున ఉన్నవాళ్లకు చేతనవునా? అంటూ సదరు కార్పొరెట్కి నూరి పోయడం చర్చకొచ్చింది. అంతెందుకు .. అక్కడ ఏ ప్రాజెక్టు పెడుతున్నారు? ఆ సీఎంతో ఒప్పందం కుదిరిందా? అంటూ ఒకరిపై ఒకరు ఆరాలు తీసుకోవడం తాజాగా రచ్చకెక్కింది. ఓ సీఎం గారి తనయుడే స్వయంగా .. సదరు పెట్టుబడిదారుతో మాట్లాడుతూ .. అక్కడ పెట్టుబడుల కంటే మా వద్దనే పెట్టుబడులు అనుకూలం అని మాట్లాడడంపైనా పలు విమర్శలొస్తున్నాయి. ప్చ్.. ఇరుగు పొరుగు బావుంటేనే మనం బావుంటాం.. అనుకోవాలి కదా! అలా కాకుండా అక్కడేం బావుంది… మా దగ్గరికొచ్చేయ్.. అని అడిగితే అవతలివాడి ముందు అలుసైపోమూ? జాతి పరువు ఏం కానూ? మనమంతా ఒక్కటి కాదా? కనీసం ఈ మాత్రం అయినా ఇంగితం ఉండక్కర్లేదూ? అంటూ చీవాట్లేస్తున్నారు. ప్చ్.. విభజన పుణ్యమా అని ఇన్ని అగచాట్లు వచ్చాయి పాపం.. !!