Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

న్యూయార్క్: తమ మధ్య సయోధ్యను కుదిర్చేందుకు భారత్, పాకిస్థాన్ దేశాలు ఒప్పుకుంటే ఆ పనిచేసేందుకు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ ఎప్పుడూ సిద్ధమేనని ఆయన ఉప అధికార ప్రతినిధి ఫరాన్ హక్ తెలిపారు. ఈ విషయాన్ని ఎప్పుడంటే అప్పుడు సమావేశమై చర్చించేందుకు ఆయన ఇది వరకే నిర్ణయించుకుని ఉన్నారని, అందుకు ఇరు దేశాలు మాత్రం కచ్చితంగా ఒప్పుకోవాల్సి ఉంటుందని చెప్పారు.

కాగా, ఇరు దేశాల మధ్య వివాదాల పరిష్కారానికి మూడో వ్యక్తి జోక్యాన్ని భారత్ ఏ మాత్రం అంగీకరించని విషయం తెలిసిందే. ప్రత్యేకంగా కాశ్మీర్ విషయంలో మాత్రం భారత్ చాలా అప్రమత్తం ఉండి ఇరు దేశాలు మాత్రమే ఆ సమస్యను సావధానంగా పరిష్కరించుకోవాలని మూడో వ్యక్తికి అవకాశం ఇవ్వొద్దని ఇప్పటికే స్పష్టం చేసింది కూడా. ఈ నేపథ్యంలో గత సెప్టెంబర్లో పాక్ పర్యటనకు బాన్ కీ మూన్ వెళ్లినప్పుడు ఇరు దేశాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు తాను సిద్ధమని చెప్పారు. ఈ విషయంపై తాజాగా కొందరు విలేకర్లు ఆయన కార్యాలయాన్ని సంప్రదించగా బాన్ కీ మూన్ ఇప్పటికీ సిద్ధంగానే ఉన్నారని ఫరాన్ హక్ పునరుద్ఘాంటించారు.