ముఖ్యమంత్రి పదవి కి ఏ నిమిషం లో రాజీనామా చేసారో కానీ మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కి సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అన్నా డీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ దెబ్బకి ముఖ్యమంత్రి పదవిని కోల్పోయిన సెల్వం ఇంకా కొత్త సమస్యలతో కొట్టు మిట్టాడుతున్నారు. సీఎం పదవి కోల్పోవడం తో ఆయనకి ఇప్పుడు అధికార నివాసం కూడా లేదు. ఈ నేపథ్యంలో, ఆయన అద్దె ఇంటిని వెతుక్కునే పనిలో పడ్డారు. 2011లో అన్నాడీఎంకే గెలుపొందిన తర్వాత పన్నీర్ సెల్వం ఆర్థికశాఖ మంత్రిగా బాధ్యతలను చేపట్టారు. అప్పుడు ఆయనకు చెన్నైలోని గ్రీన్ వేస్ రోడ్డులో ఉన్న పీడబ్ల్యూడీకి చెందిన బంగ్లాను కేటాయించారు. జయలలిత జైలుకు వెళ్లిన తర్వాత పన్నీర్ ముఖ్యమంత్రి అయ్యారు. అప్పడు కూడా ఆయన ఆ బంగ్లాలోనే ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆయన ఆ బంగ్లాలోనే ఉంటున్నారు. తాజాగా పదవిని కోల్పోవడంతో, బంగ్లాను ఖాళీ చేయాలని ఆయనకు ఆదేశాలు జారీ అయ్యారు.