బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇప్పటివరకు పలు సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంది. అందులో భాగంగానే ఇప్పుడు తన ఇంటి ఆవరణలో ఉన్న ప్రైవేటు స్విమ్మింగ్ పూల్ను గార్డెన్గా మార్చేస్తోంది. స్విమ్మింగ్ పూల్ వల్ల ఎక్కువ నీరు వృథా అవుతుంది. అది నివారించేందుకు ఇలా అంటున్నారావిడ. ‘‘యునిసెఫ్ లెక్కల ప్రకారం మన దేశంలో నలుగురిలో ఒకరికే శుభ్రమైన నీరు అందుతోంది. సాధ్యమైనంత ఎక్కువమందికి శుభ్రమైన నీరు అందించాలంటే మనవంతు ప్రయత్నం చేయాలి.
నేనీ మధ్యనే సబర్బ్లోని కొత్త అపార్టుమెంట్కి మారాను. ఆ ఇంట్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ని గార్డెన్గా మార్చేస్తున్నాను. మన దేశంలో నీటి కొరత చాలాకాలంగా ఎంతో తీవ్రతరమైంది. ‘సేవ్వాటర్’ అంటూ అంతర్జాతీయ స్థాయిలో నటీనటులు ఈ కాజ్ కోసం ప్రచారాన్ని చేస్తున్నారు. ఒక భారతీయురాలిగా, సెలబ్రిటీగా నేను కూడా ‘సేవ్ వాటర్’ని ప్రచారం చేస్తున్నాను. మార్పనేది ఇంటి నుంచే మొదలవ్వాలి. అందుకే మా ఇంటిలోని స్విమ్మింగ్ పూల్ని గార్డెన్గా మార్చేసి నీటి వృథాను అరికడుతున్నాను’’ అంటోంది కంగన.
హాలీవుడ్ స్టార్ మ్యాట్ డామన్ ‘సేవ్ వాటర్’ కాజ్కు విస్త్రతంగా ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగా ‘వాటర్ డాట్ ఆర్గ్’ అనే వెబ్సైట్ను 2009లో ప్రారంభించారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు శుభ్రమైన నీటిని అందించేలా చేయాలనేది దీని ఉద్దేశం. ప్రచారంలో భాగంగా మ్యాట్ బెంగళూరు, చెన్నయ్, పాండిచ్చేరిలలో పర్యటించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నీటి కొరత గురించి మాట్లాడారు.