లెజెండ్ సినిమాతో జగపతిబాబు ఆల్మోస్ట్ రీఎంట్రీ ఇచ్చినంత పనే చేశాడు. ఆ సినిమాలో విలన్గా నటించి ఆ తర్వాత క్యారెక్టర్ నటుడిగా రాణించాడు. ఇటు తెలుగు, అటు తమిళ్లోనూ దూసుకుపోయాడు. అయితే ఈ ఫార్ములా వేరొక హీరో టర్న్డ్ క్యారెక్టర్ ఆర్టిస్టుకి వర్తిస్తుందా? .. హీరో నుంచి క్యారెక్టర్ నటుడిగా దర్శకుడిగా మారిన జేడీ చక్రవర్తికి వర్కవుటవుతుందా? ఏమో.. రీసెంటుగా జేడీకి కాలం కలిసిరాక ఛాన్సుల్లేవ్. అయితేనేం.. ఊహించని క్రేజీ ఛాన్స్ కొట్టేశాడిప్పుడు. క్రియేటివ్ డైరక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న `నక్షత్రం`లో ఓ కీలక పాత్రలో నటించనున్నాడు. ఈ సంగతిని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
సందీప్ కిషన్, సాయి ధరమ్ తేజ్, ప్రగ్యా జైశ్వాల్, రెజీనా, ప్రకాష్ రాజ్ తదితరులు నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టులోకి జేడీ వచ్చి చేరారంటే సంథింగ్ మ్యాటర్ ఉందనే అర్థం చేసుకోవాలి. కృష్ణవంశీ- జేడీ కలయికలోని `గులాబి`ని తెలుగు ప్రేక్షకులు అంత తేలిగ్గా మర్చిపోలేం. దాదాపు 70శాతం షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం కోసం జేడీ రెడీ సెట్స్కెళ్లేందుకు అవుతున్నారు. మరి ఈ సినిమా జేడీకి మళ్లీ పోయిన జీవాన్ని తిరిగి తెస్తుందా? మళ్లీ బిజీ నటుడుగా మారతాడా? కాలమే సమాధానం చెప్పాలి.