ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వాడని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ప్రతీ ఒక్కరి చేతుల్లోనూ తప్పనిసరిగా మారిన స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ ప్రపంచంలో కొత్త ఒరవడిని సృష్టించింది. స్మార్ట్ ఫోన్ల వాడకం పెరగడంతో ఇంటర్నెట్ వినియోగం కూడా పెరిగింది. అయితే అన్ లిమిటెడ్ డేటా, వైఫై లను వాడే వారికి ఇంటర్నెట్ డేటా విషయంలో పట్టింపులు లేకపోయినా, నెలవారీ ఇంత అని లెక్క వేసుకుని డేటా వాడే వారికి ప్రస్తుతం ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బ్యాక్ గ్రౌండ్ లో యాప్స్ రన్ కావడం వల్ల ఇటువంటి వారికి వారి బడ్జెట్ ను మించి డేటా ఖర్చయిపోతోంది.
ఇటువంటి ఇబ్బందులను తొలిగిస్తూ , పొదుపుగా డేటాను వినియోగించే వారికి ఇప్పుడు శుభవార్త. ఆండ్రాయిడ్ తన కొత్త వెర్షన్ 7.0 నోగట్ లో డేటా పొదుపుకు సంబంధించిన ఒక అద్భుతమైన ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ స్మార్ట్ డేటా సేవర్ తో బ్యాక్ గ్రౌండ్ లో డేటాను వినియోగించే యాప్ లను నియంత్రించే వీలుంటుంది. మనం ఏయే యాప్ లను డేటా వినియోగించకుండా నియంత్రించాలనుకుంటున్నామో ముందే సెట్ చేసి పెట్టుకోవచ్చు. దీని వలన యూజర్స్ కు చాలా డేటా ఆదా అవుతుంది. ఇప్పటి వరకూ కొన్ని ఫోన్లలో మాత్రమే ఇలా డేటాను పొదుపు చేసే ఫీచర్ ను పొందుపరిచారు. ఇప్పుడు గూగుల్ ఆండ్రాయిడ్ మాత్రం ఏకంగా తన ఆపరేటింగ్ సిస్టమ్ లోనే పొందుపర్చడం విశేషం.