ఉపాధి కోసం విదేశానికి వెళ్లిన వారి ఊపిరి ఆగిపోయింది. రెండు కుటుంబాల్లో తీరని శోకమే మిగిలింది. సౌదీ అరేబియాలోని ఒక ప్రైవేట్ కంపెనీలో సోమవారం జరిగిన అగ్ని ప్రమాదంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు సజీవ దహనమయ్యారు. నందిపేట మండలం లక్కంపల్లి గ్రామానికి చెందిన బొంత దేవిదాస్(36), నిజామాబాద్ నగరానికి చెందిన సయ్యద్ సత్తార్(42)లు సౌదీలోని ఓ కంపెనీలో కార్మికులుగా పని చేస్తున్నారు. మధ్యాహ్న సమయంలో భోజనం అనంతరం కార్మికులంతా గదిలో నిద్రిస్తుండగా షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. వారు నిద్రిస్తున్న ప్రాంతంలోనే పలు రకాల రసాయనాలు కూడా ఉండడంతో కంపెనీ మొత్తం మంటలు వ్యాపించాయి. దీంతో దేవిదాస్, సత్తార్లు సజీవ దహనమయ్యారు. దీంతో రెండు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. దేవిదాస్ సౌదీలో రెండేళ్లు పనిచేసి స్వగ్రామం వచ్చి 8 మాసాల క్రితం మళ్లీ వెళ్లాడు. అతడికి భార్య, పిల్లలు ఉన్నారు.