Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

పసిపిల్లలకు ఏం పెట్టవచ్చు.. ఏం పెట్టకూడదు అనే విషయంలో బోలెడు సందేహాలు.  పెట్టే ఆహారం సరైంది కాకపోతే చిన్నారి ఆరోగ్యానికే ఇబ్బంది. అందుకే వారికి  ఏడాది నిండేవరకు ఎప్పుడు ఎలాంటి ఆహారం అందివ్వాలో తెలుసుకోవడం మంచిది.
*పసిపిల్లలకు తల్లిపాలు ఎంత అవసరం. అవి అందనప్పుడు ప్రత్యామ్నాయం ఏంటి?
పసిపిల్లలు తల్లిపాలు ఎంత తాగితే అంత తాగించడం మంచిది. ఒకవేళ తల్లిపాలు అందకపోతే వారికి పాల పొడులు ఉత్తమం. గేదె, ఆవు పాలలో ప్రొటీన్‌, ఫ్యాట్‌.. ఎక్కువగా ఉంటాయి. నిజానికి వీరికి ప్రొటీన్‌ మరీ అంత అవసరం ఉండదు. పైగా కొందరు శిశువులకి ప్రొటీన్‌ అలర్జీ ఉండొచ్చు. జీర్ణవ్యవస్థ సమస్యలు రావచ్చు. అందుకే ఏడాది నిండాకే గేదె, ఆవు పాలు పట్టాలి.
* ఎన్నో నెల నుంచి ఇతర ఆహార పదార్థాలను పెట్టొచ్చు?
ఆరు నెలల తరవాత ఘన పదార్థాలను ఇవ్వడం మొదలుపెట్టాలి. బియ్యం జావ మొదట అలవాటు చేయాలి. అది  తేలిగ్గా అరుగుతుంది. దాన్ని ఎలా తయారు చేయాలంటే… ముందుగా బియ్యాన్ని ఓ ఆరు గంటలు నానబెట్టి… తరువాత నీడలో ఆరబెట్టి పొడి చేయాలి. బియ్యం నానడం వల్ల త్వరగా అరుగుతుంది. ఈ పొడిలో నీళ్లు కలిపి జావలా కాయాలి. ఇది ఎంత పల్చగా ఉంటే అంత మంచిది. ఉగ్గు అనేది ఎనిమిది నెలల తరువాత పెట్టాలి. దీనికోసం మూడు కప్పుల బియ్యానికి కప్పు పప్పు తీసుకోవాలి. వీటిని రాత్రంతా నానబెట్టి ఆతరువాత ఆరబెట్టి పొడి చేసుకోవాలి. దీన్ని ఉడికించి పెట్టొచ్చు. దీంతోపాటు పసిపిల్లలకు రాగులు చాలా మంచివి. వీటిని మొలకలు కట్టించి… కాస్త వేయించి పొడి చేసి జల్లించాలి. దీన్ని జావలా చేసి  అందివ్వాలి. ఇలా ఇవ్వడం వల్ల ఆకలి పెంచే ఏఆర్‌ఎస్‌ అనే ఎంజైము జీర్ణాశయంలో విడుదలవుతుంది. అలానే చిన్నారులకు ఏ చిరుధాన్యాలు పెట్టినా ఇలానే మొలకలు కట్టించి ఇవ్వాలి. అన్నీ ఒకేసారి కాకుండా  ఒకదాని తరువాత మరొకటి పెంచుకుంటే మంచిది. అలానే ఎనిమిదో నెల నుంచీ పొట్టుతీసి సన్నగా తురిమిన బంగాళాదుంప, క్యారెట్‌ వంటివీ ఈ జావలో కలపొచ్చు.
బాగా పండిన అరటి, సపోట, బొప్పాయి మంచివి. ఏడో నెల నుంచి ఈ పండ్లు అలవాటు చేయొచ్చు. తొమ్మిదో నెల రాగానే ఉడికించిన గుడ్డులోని పసుపు సొన పెట్టాలి. తొలిసారి రెండు చెంచాలు తినిపించాలి. వారికి పడుతుందో లేదో ఓ రెండుమూడు రోజులు గమనించాలి. పన్నెండు నెలలు నిండాక పూర్తిగా గుడ్డును పెట్టొచ్చు. అలానే చేపలు కూడా ఏడాది నిండాకే అలవాటు చేయాలి.
* డీహైడ్రేషన్‌ రాకుండా నీళ్లు తాగించమంటారు ఎప్పట్నుంచీ అలవాటు చేయాలి?
తల్లిపాలు తాగే పిల్లలకు ఆరు నెలల వరకూ నీళ్లేమీ తాగించాల్సిన అవసరం లేదు. పోత పాల పిల్లలకు కాచి చల్లార్చిన నీళ్లు మధ్య మధ్యలో ఇస్తూనే ఉండాలి. ఏడో నెల నుంచైతే ఏ చిన్నారులకైనా పప్పులు, కూరగాయలు ఉడికించిన నీళ్లు తాగించడం అలవాటు చేయాలి. వాటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని అంత త్వరగా ఇష్టపడరు కానీ.. తప్పనిసరిగా తాగించాలి.
* అన్నం ఎప్పుడెప్పుడు తినిపిస్తే మంచిది? ఎంత తినిపించాలి?
మొదట్లో పావు కప్పు పెడితే సరిపోతుంది. పప్పు కూడా కలిపి పెట్టినా ఫర్వాలేదు. ఉదయం సాయంత్రం పెట్టొచ్చు. ఆరుగంటలకోసారి అన్నంతో చేసిన ఏ పదార్థం తినిపించినా ఫర్వాలేదు. సాయంత్రం ఏడు గంటలు దాటాక మాత్రం చిన్నారులకు అన్నం పెట్టకూడదు. అంత త్వరగా అరగకపోవచ్చు.
* పోషకాల లోపం అధిగమించాలంటే?
పసి పిల్లలకు పండ్లు, కూరగాయలు ఎంతో మంచిది. యాపిల్‌ని తొక్క తీసి ఉడికించాలి. పది నెలలు వచ్చాక ఆకుకూరల్ని సన్నగా తరిగి.. ఉడికించి అన్నంతో కలిపి పెట్టాలి. ఇలా చేయడం వల్ల విటమిన్లు, పోషకాల లోపం అధిగమించడం సాధ్యమవుతుంది.
ఏడు నెలల నుంచి క్రమంగా ఉప్పు, కారం, పులుపు అలవాటు చేయడం మంచిది.
* పసిపిల్లలకు డ్రైఫ్రూట్స్‌ పెట్టొచ్చా?
చాలామంది పిల్లలు లావు కావట్లేదనీ, బలంగా లేరని ఎండు ఫలాలు పెడుతుంటారు. అవి త్వరగా అరగవు. ఇది తెలియక చాలామంది ఉగ్గులో నట్స్‌ కలుపుతుంటారు. వీటిలో ప్రొటీన్‌ ఉంటుంది. నిజానికి చిన్నారులకు అంత ప్రొటీన్‌ అవసరం లేదు. వాటికి బదులు అన్నంతోపాటు పెరుగు అలవాటు చేయొచ్చు.