ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వానికి, జవాన్లకు తాను, తమ పార్టీ అండగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. పుల్వామా ఉగ్రదాడి ఘటన పట్ల విచారం చేసిన రాహుల్.. రానున్న రెండు రోజుల పాటు ఇతర రాజకీయ చర్చలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఉగ్రవాదం అంతిమ లక్ష్యం దేశాన్ని విభజించడమేనని పేర్కొన్నారు. అందుకే వారు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఉగ్రవాదులు ఎంతగా ప్రయత్నించినా ఒక్క సెకను పాటు కూడా హిందుస్థాన్ ప్రజలను వేరుచేయలేరన్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో అందరం ఒకేతాటిపై నిలవాలని, అపుడే మన ఐక్యత గురించి వారి తెలుస్తుందని పేర్కొన్నారు.
వేరే చర్చకు తావు లేదు..
‘ ఇది నివాళులు అర్పించాల్సిన సమయం. భయంకరమైన విషాదం ఇది. మన సైనికుల పట్ల అత్యంత హేయమైన దాడి జరిగింది. జవాన్ల త్యాగాలను గౌరవించుకోవాల్సిన వేళ ఇది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కాంగ్రెస్తో పాటు మరిన్ని విపక్ష పార్టీలు ప్రభుత్వానికి, జవాన్లకు అండగా ఉంటాయి. ఇందులో వేరే చర్చకు తావు లేదు’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.