గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడులో యడ్లపల్లి వెంకటేశ్వరరావు రైతు నేస్తం శిక్షణా సంస్థను ఏడాదిన్నర క్రితం ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన రైతులు ప్రతి ఆదివారం ఈ శిక్షణా కేంద్రంలో పాల్గొంటున్నారు. వ్యవసాయ, అనుబంధ శాఖలకు చెందిన వివిధ రంగాల్లోని నిపుణులు, విశ్రాంత శాస్త్రవేత్తలతో రైతులకు అవగాహన తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా రసాయనిక ఎరువులు, పురుగు మందులు ఉపయోగించకుండా సేంద్రియ, ప్రకృతి సేద్యం ద్వారా రైతులకు నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులు వస్తాయని శిక్షణ ఇస్తున్నారు.
కొర్నెపాడులోని శిక్షణా కేంద్రం వద్ద సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో అనేక రకాల పంటలను ఎరువులు, పురుగు మందులు ఉపయోగించకుండా పండిస్తున్నారు. దీంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్కు సంబంధించి ప్రత్యేక యాప్ను ఏర్పాటుచేశారు. తెలంగాణ ప్రభుత్వంతో సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం రైతు నేస్తం సంస్థ ఎంవోయూ కుదుర్చుకుంది.
వ్యవసాయరంగ నిపుణులైన స్వామినాథన్, ప్రకృతి సేద్యం, పెట్టుబడి లేని సాగు సృష్టికర్త సుభాష్ పాలేకర్ సలహాలతో యడ్లపల్లి వెంకటేశ్వరరావు ముందడుగు వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి సేద్యం, సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసి రైతుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని వెంకటేశ్వరరావు తెలిపారు.